బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 జూన్ 2021 (13:20 IST)

జూలై 26 నుంచి ఏపీలో టెన్త్ పరీక్షలు.. 11 పేపర్లు కాదు.. ఏడు పేపర్లే

కరోనాతో వాయిదా పడుతూ వచ్చిన పది, ఇంటర్ తరగతి పరీక్షలు ఏపీలో జరుగనున్నాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసింది. జూలై 26 నుంచి ఆగష్టు 2 వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 వేలకు పైగా కేంద్రాల్లో 6.28 లక్షల మంది విద్యార్ధులు ఎగ్జామ్స్‌కు హాజరు కానున్నారు.
 
కరోనా, లాక్‌డౌన్ కారణంగా వారిపై ఒత్తిడి లేకుండా ఉండేందుకు ఈ ఏడాది 11 పేపర్లకు బదులు 7 పేపర్లకే పరీక్షలు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు వెల్లడించారు. సామాన్య శాస్త్రం మినహా మిగతా సబ్జెక్టులు 100 మార్కులకు.. భౌతిక, రసాయన శాస్త్రం పేపర్‌ 1గా, జీవశాస్త్రం పేపర్ 2గా 50 మార్కుల చొప్పున నిర్వహిస్తామని అన్నారు. 
 
కాగా, జూలై 7 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు కూడా పలు ప్రతిపాదనలు సూచించింది. ఇవాళ విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహిస్తుండటంతో.. ఆయన పరీక్షల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.