మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 17 ఏప్రియల్ 2021 (19:48 IST)

కోవిడ్ నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే జ‌రిమానా వ‌సూలు: కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లాలో కోవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు  నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.ఎండి.ఇంతియాజ్ తెలిపారు. ఈ మేర‌కు క్యాంపు కార్యాల‌యంలో శ‌నివారం కోవిడ్ నివార‌ణ కోసం అధికారుల‌తో ప్ర‌త్యేకంగా స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, పిహెచ్‌సి, పిపి యూనిట్స్, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్న‌ట్లు తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం, బసవ పున్నయ్య స్టేడియం, డిఆర్ఆర్ ఇండోర్ స్టేడియం, తుమ్మలపల్లి కళాక్షేత్రం, మచిలీపట్నంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు పరీక్షలు నిర్వహిస్తున్నామ‌ని పేర్కొన్నారు. 

కరోనా లక్షణాలు ఉన్నవారు ఆయా కేంద్రాలకు ఆధార్ కార్డ్‌తో రావాల‌ని కోరారు. ఆయా కేంద్రాల వద్ద ఐసిఎంఆర్ మొబైల్ సాంపిల్ కలెక్షన్ యాప్ ద్వారా సిబ్బంది వివరాలు నమోదు చేసి సాంపిల్ కలెక్షన్ చేస్తార‌ని తెలిపారు. 24 గంటల్లో వివరాలు తెలియజేస్తామ‌న్నారు. 

కృష్ణాజిల్లా నందు కరోనా వైరస్ త్వరితగ‌తిన వ్యాప్తి చెందుతున్న నేప‌ధ్యంలో జిల్లాలో అందరూ కరోనా వైరస్ నియంత్ర‌ణ కోసం నిర్థేశించిన నిబంధనలు పాటించాల‌ని జిల్లా క‌లెక్టర్ ఇంతియాజ్ శ‌నివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖానికి తప్పనిసరిగా ముక్కు మరియు నోరు పూర్తిగా కవర్ చేసే విధముగా మాస్కు ధరించవలెను. చేతులు ఎప్పటికప్పుడు సబ్బుతో గాని శానిటైజర్ తొగాని శుభ్రపరచుకోవలెను.

ప్రజలందరూ భౌతిక దూరము పాటించవలెను. బహిరంగా ప్రదేశాలు, షాపులు మరియు ఇతర వాణిజ్య ప్రదేశములలో ముఖానికి మాస్కులు ధరించని వారికి రూ.500 జరిమానా మరియు మాల్స్, సినిమా హల్లు, ఫంక్షన్ హల్స్ (100 మంది అంతకంటే ఎక్కువ జనాభా సంచరించు ప్రదేశములు) నందు రూ.1000 జరిమానా విధించుటకు జిల్లాలో పోలీస్, పంచాయతీ, మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేయడమైనది.

షాపులు /వాణిజ్య ప్రదేశములు/ సినిమా హాల్స్ / మాల్స్ / ఫంక్షన్ హల్స్ / రైతు బజార్లు / జిమ్ సెంటర్లు తదితర ప్రాంతాల్లో ముఖానికి మాస్కు ధరించకుండా వచ్చిన వారికి వర్తక వాణిజ్య సంస్ధల యజమానులు రూ.10 మాస్కు అందజేయవలసినదిగా తెలియజేయడమైనది.  న‌గ‌రంలోని స్వ‌రాజ్య‌ మైదానం నందు నిర్వహిస్తున్న విజయవాడ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అనుమతులను కరోనా వైరస్ నియంత్రణ కొరకు రద్దు చేస్తున్నట్లుగా క‌లెక్ట‌ర్ తెలిపారు. 

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా తొలి దశలో ఫ్రంట్ లైన్ వర్క ర్లు  హెల్త్ కేర్ వర్కర్లలో ఇప్పటికి ఇంకా టీకాలు వేయించుకోకుండా  రిజిస్టర్ కాబడిన డ్రాపౌట్స్ కు కృష్ణాజిల్లాలో సోమ, మంగళవారం వ్యాక్సినేషన్ కు ఆఖరి అవకాశం ఇస్తున్నట్లు  కృష్ణాజిల్లా కలెక్టర్ ఏ.ఎండి ఇంతియాజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే , అత్యధికులకు కరోనా వ్యాక్సినేషన్ రెండవ డోసు తీసుకొనేందుకు సమయం కావడంతో మంగళవారం నుంచి వారికి టీకాలు వేయడం జరుగుతుందని ఆయన అన్నారు.

కృష్ణాజిల్లాకు  కోవిషీల్డ్ వాక్సిన్  42 వేల 650  టీకాలు, అలాగే  15 వేల  కోవ్యాక్సిన్ టీకాలు వచ్చాయని తెలిపారు. అవి జిల్లాలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. ఈ వాక్సిన్ ఫ్రంట్ లైన్ వర్క ర్లు  హెల్త్ కేర్ వర్కర్లలో ఇంకా తొలి డోసు తీసుకొనివారికి సోమ మంగళవారాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వివరించారు.

జిల్లావ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోందని ,45 ఏళ్ల వయస్సు పైబడ్డ వారందరికీ వ్యాక్సిన్ ప్రభుత్వం ఉచితంగా అందచేస్తుందని ఆయన అన్నారు.  వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్లు జారీ చేస్తోందని మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కోవిడ్ 19 వ్యాక్సిన్ సర్టిఫికెట్ తీసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.

మొదటి డోసు తీసుకున్న తర్వాత సదరు వ్యక్తి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు లింక్ వస్తుందని ఆ లింక్ క్లిక్ చేసి, ఫోన్ నెంబర్ వెరిఫై చేసి సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అన్నారు. అలాగే, మొదటి డోసు తీసుకున్న తర్వాత సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడం తప్పనిసరి వివరిస్తూ, రెండో డోసు కూడా పూర్తైన తర్వాత మరోసారి సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌లో పేరు, పుట్టిన తేదీ, రిఫరెన్స్ ఐడీ, వ్యాక్సిన్ పేరు, ఆస్పత్రి పేరు, వ్యాక్సిన్ తీసుకున్న తేదీ లాంటి వివరాలన్నీ ఉంటాయిని కలెక్టర్ అన్నారు.

ప్రపంచ అధ్యయనాల ప్రకారం కరోనా వైరస్‌కు తొలి డోసు తీసుకున్న అత్యధిక శాతం మందిలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించడం లేదని కలక్టర్ పేర్కొన్నారు. కొంతమందికి మాత్రమే జ్వరం, ఒంటినొప్పులు వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తున్నాయిని  వీరు కూడా పెద్దగా మందులు తీసుకోకుండానే ఒకటి, రెండు రోజుల్లో సాధారణ స్థితికి వస్తున్నారని తెలిపారు.

అతి కొద్దిమందిలో మాత్రమే  దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని అలాంటి వారికి చికిత్స అవసరమవుతుందన్నారు. దుష్ప్రభావాలు ఎదురవుతే ఆందోళన అవసరం లేదని, వైరస్ నుంచి కాపాడేందుకు శరీరంలో ప్రతి రక్తకణాల ఉత్పత్తి జరుగుతున్నట్లుగా భావించాలని జిల్లా కలెక్టర్ ఏ ఎం డి ఇంతియాజ్ తెలిపారు. ప్రజలు ఈ వ్యాక్సిన్ పైన అవగాహన కలిగి మొదటి డోసు, రెండో డోస్ తప్పక వేయించుకోవడం ద్వారానే కరోనాను పూర్తిస్థాయిలో జయించవచ్చని గ్రహించాలన్నారు.

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత కూడా తప్పని సరిగా మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్ గాని, సబ్బుతో గాని తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని ఆయన సూచించారు.