గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (05:09 IST)

ఎక్కడ పట్టాలో అక్కడ పట్టిన జగన్: ఇరకాటంలో నరసింహన్

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లకు కూడా ఒక పట్టాన లొంగని, కొరుకుడు పడని గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్.. జగన్ ఒక విషయంపై తనను నిలదీయగానే ఇరకాటంలో పడ్డారని సమాచారం. వైకాపా టిక్కెట్టుపై గెలిచి, అదే పార్టీ సభ్యత్వంలో కొనసాగుతూ తెలుగుదేశం ప్

యాడన్నా బావ అంటే ఒకే కానీ వంగతోట కాడ బావా అంటే పడతానా అంటూ వైకాపా అధినేత జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ను నిలదీశారు. మీరు ఉగాది పండుగకు, ఇతరత్రా సంబరాలకు  రాజభవన్‌కు ఆహ్వానించి పక్కన కూర్చుండబెట్టుకుంటే నిజంగానే సంతోషిస్తాను కానీ మా పార్టీ ఉనికికి ప్రమాదం తెచ్చే పనులకు సిద్ధమైతే.. ఎంత గవర్నర్‌ అయితే మాత్రం ఊరుకుంటానా అంటూ జగన్ గవర్నర్‌కే జలక్ ఇచ్చారు.
 
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లకు కూడా ఒక పట్టాన లొంగని, కొరుకుడు పడని గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్.. జగన్ ఒక విషయంపై తనను నిలదీయగానే ఇరకాటంలో పడ్డారని సమాచారం. వైకాపా టిక్కెట్టుపై గెలిచి, అదే పార్టీ సభ్యత్వంలో కొనసాగుతూ తెలుగుదేశం ప్రభుత్వ కేబినెట్‌లో చేరిన నలుగురు ఫిరాయింపుదారులపై తగు చర్య తీసుకోవాలంటూ వైఎస్ జగన్ తనను అభ్యర్థించినపుడు గవర్నర్ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారు. 
 
సోమవారం గవర్నర్‌కు ఉత్తరం రాస్తూ ఏపీ కేబినెట్ లోని నలుగురు మంత్రులు సుజయ కృష్ణ రంగారావు, అమరనాథ రెడ్డి, భూమా అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫారంపై గెలిచి తర్వాత మరో 17 మందితో కలిసి తమ పదవులకు రాజీనామా చేయకుండానే  టీడీపీలోకి ఫిరాయించారని జగన్ పేర్కొన్నారు. 
 
అసెంబ్లీ రికార్డుల ప్రకారం మా పార్టీలో నేటికీ 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని దాంట్లో ఈరోజు వరకు ఎలాంటి మార్పులేదని జగన్ తెలిపారు.మా పార్టీకి చెందిన ఈ నలుగురు ఎమ్మెల్యేలను టీడీపీ మంత్రివర్గంలోకి ఎలా తీసుకుంటారని గవర్నర్‌ను ప్రశ్నించారు. ఈ నలుగురు మంత్రులను కేబినెట్ నుంచి తొలగించడం ద్వారా ప్రజాస్వామ్యం యొక్క అత్యున్నత విలువలను ఎత్తిపట్టాలని జగన్ గవర్నర్‌ను కోరారు,.
 
లేదూ.. వారు కేబినెట్‌లో కొనసాగాలనుకుంటే వారి అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందిగా మీరు వారిని ఆదేశించాలని జగన్ అభ్యర్థించారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాస్వామిక చట్రాన్నే నాశనం చేస్తున్న చంద్రబాబు చర్యల పట్ల గవర్నర్ మౌన మునిలాగా చూస్తూ ఉండటం సరి కాదని, ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందని జగన్ గవర్నర్‌కి చెప్పారు. 
 
ఈ పదేళ్లలో రాష్ట్ర వ్యవహారాల్లో ఎన్నడూ ఇరుక్కోని, మకిలి అంటని గవర్నర్‌కి ఏపీలో ఫిరాయింపుదార్లను మంత్రులుగా తీసుకోవడం మహా ఇబ్బందిగా మారింది. ఫిరాయింపు మంత్రుల వ్యవహారం న్యాయస్థానం వరకు వెళితే, అది రేపు గవర్నర్ ప్రతిష్టకు కూడా భంగకరమేనని చెబుతున్నారు.