కవితమ్మ నోట జై ఆంధ్ర మాట.. తిరుమల కొండపై రాజకీయ పార్టీపై ప్రకటన
తిరుమలలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త పార్టీ ప్రారంభిస్తానని కవిత ప్రకటించారు. తాము ఏర్పాటు చేసే పార్టీకి శ్రీవారి ఆశీస్సులు వుంటాయని బలంగా నమ్ముతున్నట్లు కవిత తెలిపారు.
గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణల నుంచి బయటపడితే తిరుమలకు కాలినడకన వస్తానని కవిత మొక్కుకున్నారు. ఆ విధంగానే కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో కవిత తిరుపతికి చేరుకున్నారు. ఈ క్రమంలో తిరుపతిలో కవితకు అక్కడి అభిమానులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ నేపథ్యంలో కవిత మాట్లాడుతూ జై ఆంధ్ర అని అక్కడి వారిలో జోష్ను నింపారు. తనను లిక్కర్ స్కామ్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. నాలుగేళ్ల పాటు వేధింపులకు గురయ్యానని.. శ్రీవారి దయతో నిజాయితీ నావైపు ఉండటంతో, చివరకు న్యాయం గెలిచిందన్నారు.
గతంలో అలిపిరి మెట్ల మార్గం గుండా నడిచివచ్చి స్వామి వారిని దర్శించుకుంటానని మొక్కుకున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగానే శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చినట్లు చెప్పారు. మరోవైపు కవిత ఏపీలో వచ్చి జై ఆంధ్ర అంటూ నినాదాలు చేయడం రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్గా మారింది