మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 ఆగస్టు 2020 (15:17 IST)

మూడు రాజధానుల ముచ్చటేనా? అమరావతిలో వెచ్చించిన వేల కోట్ల సంగతేంటి?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతి భవిష్యత్తు ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనికి ప్రభుత్వం నుంచి ఇదమిత్థంగా సమాధానం చెప్పడం లేదు. శాసన రాజధానిగా ఉంటుందని మాత్రమే చెబుతోంది. కేవలం శాసనసభ సమావేశాలకు వేదిక అయితే.. ఏడాదిలో గరిష్టంగా 50-60 రోజులపాటు అధికారిక కార్యకలాపాలుంటాయి. అదీ ప్రభుత్వం ఏడాదిలో అన్ని సెషన్లూ అమరావతిలో జరపాలనుకుంటేనే! 
 
రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల రాజధాని ప్రాంతంలో పర్యటించి పనులను పరిశీలించారు. వాటి భవిష్యతేంటి? వాటిని ఏం చేయబోతున్నారో సూచనప్రాయంగానైనా చెప్పలేదు. 'శాసన రాజధాని'కే పరిమితమైతే.. ఒక భవనం సరిపోతుంది. శాసనసభ, శాసన మండలి సమావేశాల నిర్వహణకు ఇప్పటికే భవనాలున్నాయి. 
 
నిర్మాణంలో ఉన్న సచివాలయ భవనాలు, అధికారిక బంగ్లాలు, అతిథి గృహాలు, ఉద్యోగుల అపార్ట్‌మెంట్‌ టవర్లు ఏమవుతాయి? రహదారులు, వారధుల వంటి ఇతర మౌలిక వసతుల పరిస్థితేంటి? ఏడాదికిపైగా నిర్వహణ లేక తుప్పలు మొలుస్తున్న ఆ నిర్మాణాలన్నీ కాలగర్భంలో కలసిపోవడమేనా? 
 
రాజధాని ప్రణాళికలు, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యుత్‌, పైప్‌లైన్ల వంటి పనులకు వెచ్చించిన రూ.10వేల కోట్లకుపైగా ప్రజాధనం వృథాయేనా? రైతుల నుంచి సేకరించిన వేల ఎకరాల భూముల పరిస్థితేంటి? వారికి సీఆర్‌డీఏ కేటాయించిన స్థలాల సంగతేంటి? ఇవన్నీ రాజధాని ప్రజలతోపాటు, రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే వారిని మదిని తొలుస్తున్న ప్రశ్నలు.