ముద్రగడ పద్మనాభం మృతి... ప్రభుత్వ అధికారిక లాంఛనాలు వద్దన్న కుటుంబీకులు
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన అంత్యక్రియలను టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, ముద్రగడ పద్మనాభం కుటుంబీకులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించారు. జీవించివున్నపుడు అనేక విధాలుగా అవమానించి, ఇపుడు అధికారిక గౌరవాలు, సానుభూతి తమకు అవసరం లేదని ఆయన కుటుంబీకులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదే అంశంపై కాకినాడ జిల్లా కిర్లంపూడిలో వైకాపా నేత జక్కంపూడి రాజా మాట్లాడుతూ, ముద్రగడ జీవించివున్నపుడు ఆయన్ను ఎన్నో రకాలుగు ఇబ్బందులకు గురిచేశారు. అవమానించారు. చనిపోయిన తర్వాత ఇపుడు ప్రభుత్వ లాంఛనాలు వద్దని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారని వెల్లడించారు. ముద్రగడ అధికారం కోసం కాకుండా, ప్రజా సమస్యల కోసం పోరాడిన గొప్ప నాయకుడని ఆయన కొనియాడారు. దీంతో ప్రభుత్వ లాంఛనాలు లేకుండానే కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే ఈ అంత్యక్రియలు జరుగనున్నాయి.
