1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 జూన్ 2016 (10:16 IST)

రేయ్.. మీ కథ తేలుస్తా... మిమ్మల్నీ చెప్పులతో కొట్టిస్తా.. వైకాపా ఎమ్మెల్యే పచ్చిబూతులు

ప్రజా ప్రతినిధి ఒకరు ప్రభుత్వ అధికారిని పట్టుకుని నోటికొచ్చినట్టు దూషించారు. అంతటితో చల్లారని ఆయన.. ఆ అధికారిని పట్టుకుని బండబూతులు తిడుతూ చీవాట్లు పెట్టారు. 'వ్యవసాయశాఖలో ఉన్నతస్థాయి అధికారి నుంచి క్షేత్రస్థాయివరకు అంతా మోసపూరితమే... ఏ ఒక్క అధికారి కూడా నీతినిజాయితీ ఎరుగరు.. మీ కథ తేలుస్తా.. చెప్పులతో కొట్టిస్తా.. ఊళ్లోకి రానివ్వకుండా చేస్తా’ అంటూ హెచ్చరించాడు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు. కడప జిల్లా మైదుకూరు వైసీపీ శాసనసభ్యుడు. పేరు ఎస్‌.రఘురామిరెడ్డి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే ప్రభుత్వ ఆదేశాల మేరకు మైదుకూరులోని అంకాలమ్మ ఆలయం ఆవరణలో సోమవారం ఏరువాక పౌర్ణమి కార్యక్రమం నిర్వహించేందుకు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను అధికారులు ఆహ్వానించారు. 
 
మొదట సుధాకర్‌ యాదవ్‌ కార్యక్రమంలో పాలుపంచుకుని వెళ్లాక రఘురామిరెడ్డి వచ్చారు. అధికారులు ఆయన్ను స్వాగతించి.. ఏర్పాటు చేసిన స్టాళ్లను చూపించి, వేదికపై కూర్చోబెట్టారు. అయితే స్టేజీపైకి రాగానే.. ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరినీ ఎమ్మెల్యే దూషించారు. 
 
తిరిగి వీడ్కోలు పలికేందుకు కారు వద్దకు వెళ్లగా ప్రొటోకాల్‌ పాటించలేదంటూ తనను, ఏడీఏని... కొడకా అంటూ అసభ్యంగా దూషించి.. తిట్ల దండకం చదివి వెళ్లిపోయారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు స్థానిక వ్యవసాయశాఖ సంచాలకుడు వెంకటసుబ్బయ్య, మండల వ్యవసాయాధికారి లక్ష్మణ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.