రాత్రి భర్తతో గొడవ.. తెల్లవారేసరికి విగతజీవులుగా తల్లీబిడ్డలు
ఏపీలోని నంద్యాలలో దారుణం జరిగింది. నంద్యాల పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలను హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. రాత్రి భర్తతో గొడవపడిన ఆమె.. తెల్లవారేసరికి విగతవీవులుగా మారారు. మృతులను మల్లిక (26), ఇషాన్ సాయి (2), పరిమిత (7)లుగా గుర్తించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
నంద్యాల పట్టణంలోని లలితా నగర్కు చెందిన ఉదయ్ కిరణ్కు.. ఎన్జీవో కాలనీకి చెందిన మల్లికతో ఏడేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కొన్నేళ్ల నుంచి భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
శుక్రవారం రాత్రి కూడా గొడవ జరిగినట్లు సమాచారం. అనంతరం పిల్లలను తీసుకుని గదిలోకి వెళ్లి మల్లిక తలుపు వేసుకుంది. తర్వాత పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఉదయం గది తలుపులు బద్దలు కొట్టి చూడగా.. ముగ్గురూ విగత జీవులుగా పడి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.