శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 31 జులై 2014 (11:39 IST)

స్కూలు ప్రమాద బాధితులు నారా లోకేష్ పరామర్శ.. ఆర్థిక సాయం!

మెదక్ జిల్లా మాసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొన్న సంఘటనలో మరణించిన చిన్నారుల కుటుంబాలను తెలుగుదేశం యువ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పరామర్శించారు. ప్రమాదంలో మరణించిన చిన్నారుల కుటుంబాలకు సరైన నష్టపరిహారం అందజేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరుతానని చెప్పారు. 
 
మరణించిన చిన్నారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడానికి ఆయన మెదక్ జిల్లాలో పర్యటించారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని తూఫ్రాన్, ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయపల్లి, కిష్టాపూర్, గన్‌పూర్, వేలూరులలో లోకేష్ పర్యటించి, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఒక్కో చిన్నారి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. అలాగే మరణించిన చిన్నారుల కుటుంబలోని పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ పాఠశాలలో ఉచితంగా విద్యాబోధన చేస్తామని, వారు ఎంతవరకు చదువుకున్నా ఆ బాధ్యతను టీడీపీ చేపడుతుందని వారికి హామీ ఇచ్చారు.