చెట్టెక్కిన సెల్ టవర్..! 4జీ సేవలందించడానికి సిద్ధం..!!
సెల్ టవర్ చెట్టెక్కేసింది. అక్కడ నుంచే అన్ని సేవలు అందిస్తానంటోంది. పైగా అట్లాంటి ఇట్లాంటి సేవలు కాదు. 4జీ సేవలు అందిస్తుందట. అదెలాగా అంటారా... ! సాధారణంగానైతే సెల్ టవర్ ను ఏ ఇంటి మిద్దెపైనో లేదంటే ప్రత్యేకంగా తయారు చేసిన టవర్ నిర్మాణాల ద్వారా ఏర్పాటు చేస్తారు. అయితే కొత్త వస్తున్న 4 జీ సెల్ టవర్ కొత్తరకంగా వచ్చేశాయి. చెట్లకు వాటికి ఏమాత్రం తేడా లేకుండా తయారు చేసేశారు.
విజయవాడ మొగల్రాజపురం, గుంటూరు మంగళదాస్ నగర్లో వీటిని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ వీటిని ఏర్పాటు చేసింది. పైగా మెటాలిక్ సెల్ టవర్లు ఎక్కువ బరువుండటంతో పాటు స్థలాన్ని కూడా ఆక్రమిస్తాయి. కన్వెన్షనల్ టవర్ల కన్నా ఈ కమోఫ్లాజ్ టవర్లకు తక్కువ స్థలం సరిపోతుంది. చైనా- ఇండియా టెక్నాలజీతో గాల్వనైజ్డ్ స్టీల్ గొట్టాలను ఉపయోగించి 25 మీటర్ల ఎత్తులో ఈ టవర్లను నిర్మించారు. ఇవి సహజ సిద్ధమైన చెట్టు రూపంలో కనిపిస్తున్నాయి.
తెలంగాణ, ఏపీలో ఈ టవర్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి డేటా ప్రోగ్రాంను ఆప్ డేట్ చేసి కమర్షియల్ ఆపరేషన్ల కిందకు తీసుకురావడానికి సంస్థ ప్రయత్నిస్తోంది. ఏదేమైనా కొత్త తరహా 4జీ టవర్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. వీటితో రేడియేషన్ కూడా తక్కువని టెలికాం సంస్థలు చెబుతున్నాయి.