శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (02:03 IST)

వైద్యుడికిచ్చే విలువ పిల్లల ప్రాణాలకు ఇవ్వరా మంత్రిగారూ

ఆపరేషన్‌ సక్సెస్‌ అయింది అంటే రోగి ప్రాణాలతో బయటపడడం అనే కదా అర్థం. కానీ విశాఖలోని ఈఎన్‌టీ ఆస్పత్రి వైద్యులు, వైద్యారోగ్యశాఖ అమాత్యుడు సరికొత్త భాష్యం చెబుతున్నారు. రోగి చనిపోయినా శస్త్రచికిత్స విజయవంతం అయినట్టే! వైద్యుడు ఆపరేషన్‌ బాగానే చేసినా మత్తు

ఆపరేషన్‌ సక్సెస్‌ అయింది అంటే రోగి ప్రాణాలతో బయటపడడం అనే కదా అర్థం. కానీ విశాఖలోని ఈఎన్‌టీ ఆస్పత్రి వైద్యులు, వైద్యారోగ్యశాఖ అమాత్యుడు సరికొత్త భాష్యం చెబుతున్నారు. రోగి చనిపోయినా శస్త్రచికిత్స విజయవంతం అయినట్టే! వైద్యుడు ఆపరేషన్‌ బాగానే చేసినా మత్తు మోతాదు లోపం వల్ల మరణించడం తమకు సంబంధం లేదన్నట్టు తేల్చేస్తున్నారు. విశాఖలోని ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రిలో కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీ వికటించి మూడేళ్ల జయశ్రీకర్‌ అనే బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. మూడు నెలల క్రితం ఇదే తరహాలో మరో బాలుడు కూడా కాక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్రచికిత్స వికటించి మృత్యువాత పడ్డాడు. 
 
ఇలా చిన్నారులు వరుసగా చనిపోతుంటే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోకుండా, లోపాలను సరిచేయకుండా సమర్థిస్తూ ప్రకటనలివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు నెలల క్రితం ఓ చిన్నారి మరణించినప్పుడే ఉన్నతాధికారులు గాని, మంత్రి గాని సీరియస్‌గా స్పందించి ఉంటే నాలుగు రోజుల క్రితం ఘటన పునరావృతం అయ్యేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన ఘటనపై మిన్నకుండి పోవడం వల్లే జయశ్రీకర్‌ శస్త్రచికిత్సలో బాధ్యతారాహిత్యం మరోసారి చోటుచేసుకుందని అంటున్నారు.
 
కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీ వికటించి జయశ్రీకర్‌ మృత్యువాత పడిన ఘటనను మీడియా ప్రముఖంగా ప్రచురించడంతో కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పందించి విచారణకు వైద్యుల బృందంతో ఒక కమిటీని వేశారు. మరోవైపు శనివారం వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఈఎన్‌టీ ఆస్పత్రిని సందర్శించారు. వైద్యులతో బాలుడి మృతికి దారితీసిన పరిస్థితులను ఆరా తీశారు. బాలుడి ఆపరేషన్‌ సక్సెస్‌ అయిందని, కానీ గుండె పనిచేయకపోవడం (కార్డియాక్‌ అరెస్ట్‌)తో చనిపోయాడని బాధ్యులైన వైద్యులను వెనకేసుకొచ్చారు. శస్త్రచికిత్స కోసం మత్తు మందు ఇచ్చిన వైద్యుని పనితీరుపై పరోక్షంగా అనుమానం వ్యక్తం చేశారు. వైద్యుల తీరు మారకపోతే రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖలో ఏర్పాటైన కాక్లియర్‌ ఇంప్లాంట్‌ యూనిట్‌ రద్దయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇకపై ఈ శస్త్రచికిత్స వికటించి ఒక్క మరణం కూడా సంభవించరాదని స్పష్టం చేశారు. మంత్రి స్పందన చూసిన వారు బాలుడి మృతి కేసును నీరుగార్చడానికేనని వ్యాఖ్యానిస్తున్నారు.