శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 15 అక్టోబరు 2019 (20:33 IST)

కేరాఫ్ కంచరపాలెం, గుట్టు చప్పుడు కాకుండా శ్మశానికి యువతి మృతదేహం... ఏం జరిగింది?

కంచరపాలెం అనగానే మనకు ఆ పేరుతో నిర్మించిన కేరాఫ్ కంచరపాలెం చిత్రం గుర్తుకు వస్తుంది. ఇప్పుడు మరోసారి ఈ పేరు వార్తల్లోకి ఎక్కింది. విషయం ఏంటంటే... కంచరపాలెం పరిధిలో వున్న ఓ శ్మశానానికి 17 ఏళ్ల యువతి శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఆమె కుటుంబ సభ్యులు తీసుకురావడమే. అది కూడా ఎవరికీ తెలియకుండా గోప్యంగా అంత్యక్రియలు చేయాలని వారు ప్రయత్నించడం, యువతి గొంతు పైన గాయాలు వుండటంతో కాటికాపరికి అనుమానం వచ్చింది. దాంతో అసలు విషయం బయటకు వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే... విశాఖ నగరంలోని మధురవాడకు చెందిన గోరి బహుదూర్‌ అనే వ్యక్తి చైతన్య ఇంజనీరింగ్‌ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఏమైందో తెలియదు కానీ సోమవారం అతడి 17 ఏళ్ల కుమార్తె మీను అనుమానాస్పద రీతిలో చనిపోయింది. దీనితో ఆమె శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా జ్ఞానాపురం శ్మశాన వాటికకు తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. 
 
శవం వెంట కుటుంబ సభ్యులు తప్ప వేరే ఎవరూ లేకపోవడంతో కాటికాపరికి అనుమానం వచ్చి యువతి శవాన్ని పరీక్షించి చూశాడు. ఆమె గొంతుపైన గాయాలు కనబడ్డాయి. దీనితో ఏదో ఘోరం జరిగి వుంటుందని కంచరపాలెం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకుని యువతి శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించారు. 
 
రిపోర్టులో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నదన్న విషయం బయటపడితే పరువు పోతుందన్న భయంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానానికి తీసుకెళ్లినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.