శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2016 (17:44 IST)

చిత్తూరు జిల్లాలో అంటరానితనానికి అంతిమయాత్ర

నిజమే.. మీరు.. విన్నది నిజమేనండి. భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్‌ బి.ఆర్.అంబేద్కర్‌ కలలు కన్నది అందరు ఒకటేనని. అయితే ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో దళితులను అగ్రవర్ణాల ప్రజలు అంటరానివారిగానే చూస్తున్నారు. ఇలాంటి అంటరానితనానికి అంతిమయాత్ర అనే ఒక వినూత్న కార్యక్రమానికి చిత్తూరు జిల్లాలో శ్రీకారం చుట్టారు ట్రాన్స్‌ఫామ్‌ ఇండియా ఫౌండేషన్‌ సంస్థ ప్రతినిధులు. 
 
చిత్తూరు జిల్లాలోని నగరి, నిండ్ర, పిచ్చాటూరు, సత్యవేడు మండలాల్లోని నాలుగు గ్రామాలలో దళితులు నివాసముండే ప్రాంతంతో పలు కార్యక్రమాలను నిర్వహించారు. దళితులు ఉన్న ప్రాంతానికి దళితవాడ అనే పేరు తీసి వేసి గ్రామస్థులు నిర్ణయించుకున్న పేరును బోర్డుగా తయారుచేయించి గ్రామం మధ్యలో నిలబెట్టారు. అంతేకాదు ఆలయంలో దళితులతో కలిసి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. దళితులు తక్కువ కులం కాదని, ప్రపంచంలో అందరు సమానమేనని ట్రాన్స్‌ఫామ్‌ ఇండియా ఫౌండేషన్‌ సంస్థ వ్యవస్థాపకులు జయచంద్ర నాయుడు అంటున్నారు. 
 
అంతేకాదు శ్మశానాలు కూడా ఒకేచోట ఏర్పాటు చేస్తోందీసంస్థ. చనిపోయిన వారు ఏ కుల, మతాలకు చెందిన వారైనా ఒకే స్మశానంలో పూడ్చిపెడతామని చెపుతున్నారు. దేశంలో అగ్రవర్ణాలు ఇప్పటికీ దళితులను కించపరుస్తున్నాయని, ఇలాంటి వాటికి చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. మరోవైపు బ్రాహ్మణులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దళితులతో కలిసి ఆలయంలో పూజలు చేశారు.