మంగళవారం, 21 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 నవంబరు 2025 (12:18 IST)

విశాఖ నగరంలో ఘోరం- ఏడు నెలల గర్భిణి.. అన్యోన్యంగా జీవించిన దంపతులు.. ఆత్మహత్య

Pregnant
విశాఖ నగరంలో ఘోరం జరిగింది. అన్యోన్యంగా జీవిస్తున్న యువ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుల్లో ఏడు నెలల గర్భిణి ఉండటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఫోర్త్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అక్కయ్యపాలెంలో ఈ ఘటన వెలుగుచూసింది. 
 
వివరాల్లోకి వెళితే అక్కయ్యపాలెం, దాలిరాజు సూపర్‌మార్కెట్‌ సమీపంలో సూరిశెట్టి వాసు తన భార్య అనిత, తల్లితో కలిసి నివసిస్తున్నాడు. ఏడాది క్రితం వీరికి వివాహం జరిగింది. ప్రస్తుతం అనిత ఏడు నెలల గర్భిణి. ఆదివారం వాసు తల్లి ఒక ఫంక్షన్‌కు వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చి ఇంటి తలుపు తట్టగా ఎంతసేపటికీ తీయలేదు. 
 
అనుమానంతో కిటికీలోంచి చూడగా లోపల దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు. కొడుకు, కోడలు విగతజీవులుగా కనిపించారు. కొడుకు, కోడలిని ఆ స్థితిలో చూసి తల్లి అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయింది. 
 
ఈ ఘటనలో అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే, అనిత గర్భంలో ఉన్న బిడ్డను బతికించేందుకు పోలీసులు ఆమెను హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. అయితే, అప్పటికే గర్భంలోని ఆడశిశువు కూడా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వాసు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 
 
అయితే, పెళ్లైన నాటి నుంచి వారిద్దరూ ఎంతో ఆనందంగా, అన్యోన్యంగా ఉండేవారని, వారి మధ్య ఎలాంటి గొడవలు లేవని తల్లి, బంధువులు పోలీసులకు తెలిపారు. దీంతో వారి మృతికి గల కారణాలపై మిస్టరీ నెలకొంది. పోలీసులు చుట్టుపక్కల వారిని విచారిస్తూ ఆధారాలు సేకరిస్తున్నారు.