మిస్టర్ సాంబా... లంచం ఇచ్చి పోస్టింగ్ వేయించుకుని తమాషాలు చేస్తున్నావా : ఆర్డీవోపై రెచ్చిపోయిన పేర్నినాని
మిస్టర్ సాంబశివరావు.. మంత్రి కొల్లు రవీంద్రకు లంచం ఇచ్చి పోస్టింగ్ వేయించుకుని ఏం తమాషాలు చేస్తున్నావా అంటూ మచిలీపట్నం ఆర్డీవో సాంబశివరావుపై వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని రెచ్చిపోయారు. మంత్రి దగ్గర చెంచాగిరి చేసి బాగా మూటలు పట్టుకెళ్లొచ్చని అనుకుంటున్నావా.. మీ ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారా.. మీరొచ్చాకే వంద ఎకరాల్లో మడ తవ్వేస్తున్నారు... భోజనం చేయడం మానేసి ఆడి దగ్గర వీడి దగ్గర లంచాలు తీసుకుంటున్నారా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, మచిలీపట్నం ఆర్డీవో సాంబశివరావుపై అభ్యంతరకరమైన పదాలతో తిడుతూ రెచ్చిపోయారు. డివిజన్ పరిధిలో అక్రమంగా పెద్దఎత్తున చెరువులు తవ్వేవారిని వదిలేసి.. చిన్న రైతులను ఆర్డీవో బెదిస్తున్నారంటూ జాయింట్ కలెక్టర్ నవీన్కు వినతిపత్రాన్ని పేర్ని నాని సోమవారం అందజేశారు.
అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో పేర్ని మాట్లాడుతూ.. ఆర్డీవో సాంబశివరావు, బందరు తహసీల్దార్ల బాగోతాలన్నీ జాయింట్ కలెక్టర్కు చెప్పానన్నారు. 'జేసీ శంషేర్లా ఉంటే.. సాంబడు మరోలా (తీవ్ర వ్యాఖ్య చేశారు) ఉన్నాడు. కోనపల్లెతుమ్మలపల్లిలో ఓ రైతు తన 80 సెంట్లలో చెరువు మరమ్మతులు చేసుకుంటే మీ తాతకు పట్టాలున్నాయా? ఆ పట్టా తీసుకురా అని ఆర్డీవో అన్నాడు. లేదంటే చెరువు పూడ్చేస్తానంటూ బెదిరించాడు.
సాంబశివరావ్.. నీకు ఏం పోయే కాలం. మీకు ఖలేజా ఉంటే.. నిజంగా రెవెన్యూ అధికారివైతే.. కానూరు, పెదపట్నం రెవెన్యూ గ్రామాల్లో మడ అడవి తవ్వుతుంటే ఏం చేస్తున్నావ్.. మీకు సిగ్గు లేదా..? పక్క జిల్లా నుంచి వచ్చిన రాజులు వందల ఎకరాలు తవ్వుతుంటే ఏం చేయగలిగారు..? చిన్న రైతులే మీకు కనిపించారా?. మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచి కుమారుడు మంత్రాల శ్రీనుకు ఎకరానికి రూ.50 వేలు ఇవ్వకుంటే చెరువుల్లో పనులు చేసుకోనివ్వట్లేదు.
వీరికి డబ్బులు కట్టి టోకెన్ తెచ్చుకోకుంటే.. తహసీల్దార్, ఆర్డీవో, సిబ్బంది వెళ్లి చెరువులు పూడుస్తామంటారు. ఆర్డీవో సాంబడు తెదేపా నేతలకు దళారీగా మారాడు. చదువుకొని ఉద్యోగాలు చేసేది ఇందుకా..? ఏసీబీ అధికారి జయలక్ష్మితో మాట్లాడి మీరు ఎక్కడెక్కడ ఎంతెంత లంచాలు తీసుకున్నారో తేలుస్తా అంటూ పేర్నినాని చిందులు తొక్కారు.
