శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 అక్టోబరు 2020 (14:06 IST)

వాయిదాల పర్వంలో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణలో వాయిదాల పరంపర కొనసాగుతోంది. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ నెల 15వ తేదీన జరగాల్సిన విచారణను, 20వ తేదీ వాయిదా వేయగా, మంగళవారం విచారణకు రావాల్సిన కేసుల విచారణ మళ్లీ ఈ నెల 27వ తేదీకి వాయిదా పడింది. 
 
సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ మధుసూదనరావు సెలవులో ఉండటంతోపాటు దసరా పండగ నేపథ్యంలో కేసుల విచారణను ఇన్‌చార్జి న్యాయమూర్తి ఈ నెల 27కి వాయిదా వేశారు. మెట్రో పాలిటన్‌ సెషన్‌ జడ్జి(ఎంఎస్‌జే) పరిధిలో ఉన్న ఈడీ కేసు నవంబరు 9వ తేదీకి వాయిదా పడింది. 
 
కాగా, జగన్‌ కేసులు విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టుకే ఈ కేసును కూడా బదిలీ చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ నవంబరు 5వ తేదీకి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈడీ కేసును నవంబరు 9కి వాయిదా వేశారు. సీఎం జగన్‌కు సంబంధించిన అన్ని కేసులు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఉండగా, ఈడీ కేసు మాత్రం ఎంఎస్‌జే కోర్టు విచారణలో ఉంది.