కర్నాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజ్యసభలో అడుగుపెట్టనున్నారా? అందుకే ఆమె కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తన భర్త బ్రదర్ అనిల్ కుమార్తో కలిసి ఢిల్లీకి వెళ్లిన వైఎస్ షర్మిల శుక్రవారం రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కర్నాటక నుంచి రాజ్యసభకు పంపించాలని ఆమె కోరినట్టు సమాచారం.
వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సమయంలో షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాజ్యసభ సీటును హామీ ఇచ్చిందని తెలుస్తోంది. ఇపుడు కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీలో పార్టీని బలోపేతం చేయడానికి, రాజ్యసభలో కాంగ్రెస్ తరపున ఏపీ గొంతును వినిపించేందుకు తనకు రాజ్యసభ సీటును ఇవ్వాలని ఆమె కోరుతున్నట్టు సమాచారం.
రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత షర్మిల కారులో వెళుతుండగా మీడియాతో మాట్లాడుతూ, ఎప్పటిలా సాధారణ సమీక్ష జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు చెప్పారు. రాహుల్ గాంధీతో షర్మిలతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్ కూడా పాల్గొన్నారు.
