శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. ఏపీ టూరిజం
Written By WD

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణలోని ప్రధాన ఘట్టాలు

నేటి తరం వారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరణ ఏవిధంగా జరిగిందో తెలియక పోవచ్చు. అయితే వారికి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ.. సమాచారం సేకరించే సమయం, తీరిక వారికి ఉండదు. అలాంటి వారికోసం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ సమాచారాన్ని కింది ఇస్తున్నాం.

ముఖ్యంగా ఆధునిక ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో మూడు ముఖ్యమైన చారిత్రక ఘట్టాలున్నాయి.

మధ్య యుగంలో కాకతీయులు, విజయనగర రాజులు, చోళులు, చాళుక్యులు, రెడ్డి రాజులు మొదలైన అనేక వంశాల పాలనలో ఉంటూ వచ్చిన ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్‌ 19వ శతాబ్దం ఆరంభం నాటికి కొంత భాగం బ్రిటిషు వారి పాలనలోను, మరికొంత నిజాం నవాబు ఏలుబడిలోను ఉంది. సర్కారులుగాను, రాయలసీమగాను, హైదరాబాదుగాను విడిపోయి ఉన్న ఈ ప్రాంతాలను కలిపే మూలసూత్రం - వీరి మాతృభాష అయిన తెలుగు. ఒకే రాష్ట్రంగా ఏర్పడాలన్న ఆకాంక్ష అన్ని ప్రాంతాల ప్రజలలోను బలంగా ఉండేది.

బ్రిటిషు వారి పాలనలో ఉన్న సర్కారు (కోస్తా) జిల్లాలు, రాయలసీమ జిల్లాలు ప్రత్యేక రాష్ట్రం కోసం ముందు ఉద్యమించారు. ఈ ప్రాంతం, తమిళ ప్రాంతాలతో పాటు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. ఆర్ధిక, రాజకీయ రంగాల్లో తమిళుల అహేతుక ఆధిపత్యం భరించలేక, తమకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలన్న బలీయమైన కోరిక వలనా వీరు ప్రత్యేక రాష్ట్ర దిశగా ముందు ఉద్యమించారు.

హైదరాబాదు సంస్థానం కథ వేరుగా ఉండేది. నిజాం ఏలుబడిలో ఉన్న వీరు, స్వాతంత్ర్యం తరువాత ప్రత్యేక దేశంగా ఏర్పడాలన్న నిజాము ఆలోచనకు వ్యతిరేకంగాను, నిజాం యొక్క రజాకార్ల దౌష్ట్యాన్ని ఎదిరించేందుకు గాను నడుం కట్టారు. నిజాము పాలన నుండి బయటపడి భారత దేశంలో విలీనం కావాలన్నదే అప్పటి వీరి ప్రధాన లక్ష్యం.

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు

బ్రిటిషు పరిపాలనా కాలంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీ లో భాగంగా, బ్రిటిషు వారి అధికారంలో ఉండేది. మద్రాసు ప్రెసిడెన్సీలో శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలు ఉండేవి. మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండేది. జనాభాలోను, విస్తీర్ణంలోను ఆంధ్ర ప్రాంతమే హెచ్చుగా ఉన్నప్ప్పటికీ, పరిపాలనలోను, ఆర్ధిక వ్యవస్థ లోను తమిళుల ఆధిపత్యం సాగేది. సహజంగానే, తమకంటూ ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే, రాజకీయంగాను, ఆర్ధికంగాను గుర్తింపు లభిస్తుందని వారు ఆశించారు.

1912 లో అధికారికంగా ప్రత్యేక రాష్ట్ర పోరాటం ఆరంభమైంది. ఉద్యమానికి టంగుటూరి ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవరెడ్డి వంటి నాయకులు సారధ్యం వహించారు. 40 సంవత్సరాల పోరాటం, రెండు సుదీర్ఘ నిరాహార దీక్షలు, అమరజీవి ఆత్మార్పణం, విధ్వంసంకు దారితీసిన ప్రజల కోపం తరువాత 1952 అక్టోబర్ 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్రుల చిరకాల స్వప్నం ఫలించింది.

హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు

1947 ఆగష్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాదు నిజాము పాలన నుండి విముక్తి కాలేదు. ప్రత్యేక దేశంగా ఏర్పడాలన్న నిజాము, తన ఆలోచనకు తగినట్లుగా ప్రయత్నాలు చేసాడు. ఐక్యరాజ్యసమితి యొక్క భద్రతా మండలికి సమస్యను నివేదించడం, సైన్యం, ఆయుధాల సమీకరణ వంటి ప్రయత్నాలు వీటిలో కొన్ని. దీనికి తోడు రజాకార్ల హింస పెచ్చుమీరడంతో, హైదరాబాదు ప్రజలు కమ్యూనిస్టుల నాయకత్వంలో సాయుధ పోరాటం జరిపారు. పరిస్థితి విషమిస్తున్న దశలో భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 13 న పోలీసు చర్యకు దిగింది.

భారత సైన్యం హైదరాబాదును ముట్టడించి, నిజామును ఓడించింది. 5 రోజుల్లో ముగిసిన పోలీసు చర్యతో సెప్టెంబర్ 18 న హైదరాబాదు సంస్థానం భారత దేశంలో విలీనమయింది. మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి హైదరాబాదు సైనిక గవర్నరుగా బాధ్యతలు స్వీకరించి, 1949 చివరి వరకు ఆ పదవిలో ఉన్నారు. 1950 జనవరిలో ఎం.కె.వెల్లోడి ముఖ్యమంత్రి అయ్యాడు, నిజామును రాజ్‌ ప్రముఖ్‌ గా ప్రకటించారు. 1952 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదటి ఎన్నికైన ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ

1953 డిసెంబర్‌ లో సయ్యద్‌ ఫజల్‌ ఆలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్విభజన కమిషను ఏర్పాటయింది. విశాలాంధ్ర ఏర్పాటు లోని ప్రయోజనాలను అది గుర్తించినా, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అది సమర్ధించింది. దీని నివేదికపై తెలంగాణా, విశాలాంధ్ర వాదులు తమతమ వాదనలను తీవ్రతరం చేసారు. కమ్యూనిస్టులు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ, హైదరాబాదు శాసనసభకు రాజీనామా చేసి, ఈ విషయంపై ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు.

హైదరాబాదు శాసనసభలో అధిక శాతం సభ్యులు విశాలాంధ్రను సమర్ధించారు. కాంగ్రెసు అధిష్ఠానం కూడా విశాలాంధ్రనే సమర్ధించి, ఆంధ్ర తెలంగాణా నాయకులను తమ విభేదాలను పరిష్కరించుకొమ్మని ఒత్తిడి చేసింది. ఆ విధంగా వారిమధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరి, 1956 నవంబర్ 1 న అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.