బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. ఏపీ టూరిజం
Written By Munibabu
Last Modified: మంగళవారం, 10 మార్చి 2009 (17:22 IST)

జైన దేవాలయం కొలనుపాక... చూసొద్దాం రండి

దేశంలో జైన దేవాలయాలకు ప్రముఖమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నా మన రాష్ట్రంలోనూ ఓ ప్రముఖమైన జైన దేవాలయం ఉంది. నల్గొండ జిల్లాలోని కొలనుపాక ప్రముఖ జైన దేవాలయంగా గత కొన్నేళ్లుగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. దాదాపు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రదేశం కొత్త రూపం సంతరించుకోవడంతో పర్యాటకులను విశేషంగా ఆకర్షించడంతోపాటు నేడు ప్రముఖ పర్యాటక క్షేత్రంగా విలసిల్లుతోంది. దాదాపు వందేళ్ల క్రితం కనుగొనబడిన కొలునుపాక జైన దేవాలయం ప్రస్తుతం కొత్తరూపు సంతరించుకుంది.

కొలనుపాక చరిత్ర
దాదాపు 9వ శతాబ్ధంలో రాష్ట్రకూటుల పాలనలో కొలనుపాక ప్రాముఖ్యం పెరిగింది. అప్పట్లో ప్రముఖ జైన క్షేత్రంగా ఉన్న ఈ ప్రాంతాన్ని రాష్ట్రకూటులు ఆరోజుల్లో సైన్యాగారంగా మార్చడంతోపాటు ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. అటుపై ఈ ప్రాంతాన్ని పాలించిన చాళుక్యులు సైతం ఈ ప్రాంతంపై శ్రద్ధ కనబర్చడంతో ఇక్కడ అభివృద్ధి తారాస్థాయికి చేరుకుంది. వీరి కాలంలోనే ఇక్కడ అన్ని రకాల కట్టడాలు నిర్మించబడ్డాయి.

అయితే ఆ తర్వాత చోళులు, పల్లవులు జైనులపై దాడులు ప్రారంభించడంతో ఈ ప్రాంతంతో పాటు ఇక్కడి ఆలయం సైతం దాదాపుగా ధ్వంసమైంది. అటుపై ఈ ప్రాతం కాలగర్భంలో కలిసిపోయింది.

కొలనుపాక పునరుద్ధరణ
దాదాపు వందేళ్ల క్రితం కొలునుపాక ఆలయం వెలుగులోకి వచ్చింది. దాంతోపాటు ఈ ప్రాంత విశిష్టత సైతం అందరికీ తెలిసివచ్చింది. అయితే ఈ ప్రాంతం మాత్రం గత 20ఏళ్ల వరకు ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదు. ఈ క్రమంలో దాదాపు 20 ఏళ్ల క్రితం నుంచి మాత్రమే ఈ ప్రాతం అభివృద్ధి చెందడం ప్రారంభించింది. రాజస్థాన్, గుజరాత్‌లాంటి రాష్ట్రాలకు చెందిన జైనులు ఎక్కువ మొత్తంలో విరాళాలు సమర్పించడంతో ఈ ప్రాతంలో నిర్మాణాలు ఊపందుకున్నాయి.


దీంతో కొలనుపాకలోని ఆలయం కొత్త రూపు సంతరించుకుంది. ఆలయాన్ని పునర్నిర్మించే క్రమంలో దాదాపు వెయ్యిమంది కళాకారులు పనిచేయడంతో పాటు మరెందరో కార్మికులు కూడా ఇందులో భాగస్వాములయ్యారు. దీంతో ఓ అద్భుత చిత్రకళతో కూడిన జైన దేవాలయం కొలనుపాకలో రూపం సంతరించుకుంది.

కొలనుపాక దేవాలయంలోని విశిష్టతలు
కొలనుపాకలోని జైన దేవాలయం అద్భుత శిల్పకళకు పెట్టింది పేరు. కోట ద్వారాన్ని తలదన్నేలా నిర్మించిన ఆలయ ప్రవేశ ద్వారం ప్రారంభంలోనే పర్యాటకులను కట్టిపడేస్తుంది. ఈ మార్గంలో నిర్మించిన రెండు ఏనుగు శిల్పాలు మనకు ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఠీవీగా నిల్చుని ఉంటాయి. ఇక లోపల ఉన్న భారీ గోపురంపై అద్భుతమైన శిల్పకళ చూపరులను కట్టిపడేస్తుంది. అలాగే ఆలయ ఆవరణలోని ఏ స్థంభాన్ని చూసినా అందులోని సూక్ష్మ చిత్రకళ మైమరపింపజేస్తుంది.

అలాగే ఆలయంలో కొలువైన తీర్థం కరుల ప్రతిమలు పర్యాటకులకు చక్కని అనుభూతిని ఇస్తాయి. దీంతోపాటు ఆలయ ఆవరణ మొత్తం పచ్చని చెట్లతో నిండి ఉండడం ఆవరణ మొత్తం పాలరాయితో నిర్మించడం ఇక్కడి ఆలయానికి అదనపు అందాన్ని తెచ్చాయి.

ఇక ఈ ప్రదేశానికి ఉన్న చారిత్రక విశేషం గురించి చెప్పాలంటే వీరశైవులకు పూజ్యనీయులైన రేణుకాచార్యులవారు లింగంలోంచి ఉద్భవించిన ప్రదేశం ఇదేనని చెబుతారు. ఇక్కడ ఉండే సోమేశ్వరాలయం అనే శివాలయంలో రేణుకాచార్యల లింగోద్భవ శిల్పాన్ని చూడవచ్చు. అయితే ఈ దేవాలయం మాత్రం శిధిలావస్థలో ఉంది.

కొలనుపాకకు ప్రయాణం
నల్గొండ జిల్లాలోని ఆలేరు మండలంలో ఉన్న కొలనుపాకను కులపాక అనికూడా పిలుస్తారు. హైదరాబాద్‌నుంచి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఈ కొలనుపాక ఉంది. హైదరాబాద్‌నుంచి వరంగల్ పట్టణానికి వెళ్లే మార్గంలో కొలనుపాక వస్తుంది. ఆలేరు రైల్వే స్టేషన్‌నుంచి కొలనుపాక కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది.