గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. ఏపీ టూరిజం
Written By Munibabu
Last Modified: బుధవారం, 1 అక్టోబరు 2008 (18:47 IST)

పురాతన సంస్కృతీ నిలయాలు బెలూం గుహలు

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో వెలసిన బెలూం గుహలు మన పురాతన సంస్కృతికి నిలయాలుగా ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని కొలిమిగుంట్ల మండలంలో ఉన్న ఈ బెలూం గుహలు దాదాపు పది లక్షల ఏళ్ల క్రితం సహజసిద్ధంగా ఏర్పడినవి కావడం విశేషం.

భారత ఉపఖండంలోనే రెండో అతిపెద్ద గుహల సముదాయంగా పేరు సంపాదించిన ఈ బెలూం గుహలను ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సంరక్షిస్తోంది.

బెలూం గుహల చరిత్ర
నిపుణుల అంచనాల ప్రకారం బెలూం గుహలు దాదాపు పది లక్షల ఏళ్ల క్రితం సహజసిద్ధంగా ఏర్పడ్డాయి. అలాగే దాదాపు క్రీ.పూ. 4,500 ప్రాతంలో ఈ బెలూం గుహల్లో మానవులు నివశించినట్టు కూడా ఆధారాలు లభించాయి. ఇంతటి ప్రాముఖ్యత కల్గిన ఈ బెలూం గుహల సముదాయం 1982 ప్రాంతంలో ప్రపంచం దృష్టికి వచ్చాయి.

జర్మనీకి చెందిన డేనియల్ జెబోర్ నేతృత్వంలోని నిపుణుల బృందం ఈ బెలూం గుహల విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. దీంతో 1985లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గుహలను తన ఆధీనంలోకి తీసుకుంది. అలాగే 1999 నుంచి ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ ఈ బెలూం గుహలను తమ అధీనంలోకి తీసుకుని అక్కడ విస్తరణ కార్యక్రమాలు మొదలు పెట్టింది.


ఇలా బెలూం గుహలు సందర్శనకు అనువుగా మారడంతో 2002 వీటిని ప్రజలు సందర్శించడం ప్రారంభమైంది. పర్యాటకుల సందర్శనార్థం పర్యాటకశాఖ ఇక్కడ అనేక ఏర్పాట్లు చేసింది. గుహల లోపలి భాగంలో పర్యాటకులు కలియ తిరగడానికి అనువుగా దాదాపు 1.5 కిలోమీటర్ల మేర సిమెంట్‌తో దారిని నిర్మించారు.

అలాగే గుహ లోపలి అందాలను చూచేందుకు వీలుగా ఇందులో విద్యుత్ దీపాలను కూడా ఏర్పాటు చేశారు. భూమికి అడుగుభాగంలో ఉన్న ఈ గుహల్లోకి చేరుకునేదంకు వీలుగా దాదాపు 20 మీటర్ల లోపలికి దిగేలాగా మెట్లను నిర్మించారు. భూ గర్భంలో ఉండడంతో లోపలకు వెళ్లే పర్యాటకులకు ఇబ్బంది రాకుండా ఆక్సిజన్ బ్లోయర్లు కూడా ఏర్పాటు చేశారు.

ఈ ఏర్పాట్లే కాకుండా గుహల లోపలి భాగంలో ఫౌంటేన్స కొలను లాంటి వాటిని కృత్రిమంగా ఏర్పాటు చేశారు. ఈ బెలూం గుహల కప్పు భాగం నుంచి కొన్ని ఆకారాలు పొడుచుకు వచ్చి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. స్థానికులు ఈ ఆకారాలను వివిధ పేర్లతో పిలుస్తూ భక్తితో పూజిస్తారు.

రవాణా సౌకర్యాలు
కర్నూలు జిల్లాలో వెలసిన ఈ బెలూం గుహలు కర్నూలు పట్టణానికి దాదాపు 110 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి. అలాగే రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నుంచి 320 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి.

ఈ బెలూం గుహలు చేరాలంటే కర్నూలు, నంద్యాల మీదుగా చేరుకోవచ్చు. అలాగే అనంతపురం జిల్లా తాడిపత్రి మీదుగా, కడప జిల్లా జమ్మలమడుగు మీదుగా రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.