శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. ఏపీ టూరిజం
Written By Ganesh

వైభవం నశించిన విగతజీవి "కనిగిరి దుర్గం"

FILE
"రాజులు పోయినా, రాజ్యాలు పోయినా" ఒకనాటి వైభవానికి, దర్పానికి నిదర్శనంగా.. కాలగర్భంలో కలసిపోయిన రాజసానికి సాక్షీభూతంగా నిలిచినదే "కనిగిరి దుర్గం". మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఆనాడు అజేయంగా, అంగరంగ వైభవంగా విలసిల్లిన ఈ కోట.. విజయ మార్తాండ దుర్గంగా, కనకగిరిదుర్గం (బంగారుకొండ)గా ఆ తర్వాత "కనిగిరి దుర్గం"గా రూపుదాల్చింది.

శతాబ్దాల చరిత్ర కలిగిన కనిగిరి దుర్గం... విజయనగర సామ్రాజ్యాధీశులు, గజపతులు, యాదవులు, రెడ్డిరాజులు, రాజ ప్రతిధులు, బహమనీ సుల్తానుల ఏలుబడిలో ఆనాడు ప్రముఖ స్థానాన్ని అలంకరించింది. అయితే ఇప్పుడు ఆ కోట ఒక అవశేషం మాత్రమే. నేడు ఈ కోటపై కొన్ని చారిత్రక కట్టడములు కలవు. వాటిలో కనిగిరి కోట, బావులు, దుర్గము ముఖ్యమైనవి కాగా.. రెండు జీర్ణావస్థలో ఉన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. కొండపై ఒక చదరపు మైలు వైశ్యాల్యం కలిగిన చదును నేల ఉంది. పూర్వం ఈ కొండపై ఒక పట్టణము ఉండేదని స్థానికుల కథనం

కనిగిరి దుర్గం 1314వ శతాబ్దంలో కాటంరాజు ఏలుబడిలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలనుబట్టి తెలుస్తోంది. కాటంరాజు కనిగిరి దుర్గాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలించాడనీ, ఆయన ఏలుబడిలో కడప, కర్నూలు ప్రాంతాలు కూడా ఉన్నట్లు కొన్ని శాసనాల ద్వారా అర్థమవుతోంది. కాటంరాజు పాలనా కాలంలో కనిగిరి ప్రాంతంలో కరువు ఏర్పడిందట. అయితే తనకుండే అపారమైన పశు సంపదను రక్షించుకునే నిమిత్తం ఆయన నెల్లూరు పాలకుడయిన మనుమసిద్ధి రాజుతో పుల్లరి పద్ధతి ఒప్పందాన్ని చేసుకున్నాడట.
రాయల శ్రీమతి స్నానమాడిన కోనేరు..!!
ఈ కోటలో రెండు మంచినీటి చెరువులు, ఒక కోనేరు ఉన్నాయి. కోటి చెన్నమ్మక్క బావిగా కోనేరు ఒకటి వాడుకలో ఉంది. శ్రీకృష్ణదేవరాయులు భార్య రాణి చెన్నమ్మదేవి ఈ కోనేరును నిర్మించినట్లు శాసనాలు ద్వారా తెలుస్తోంది. బావి సమీపంలో విష్ణు ఆలయం ఉంది. అయితే విష్ణువు...


ఈ ఒప్పందం ప్రకారం పశువులను నెల్లూరులోని పచ్చిక బయళ్ళలో మేపుకునే అవకాశం కలుగుతుంది. ఈ విధంగా పుల్లరి పద్ధతిలో కాటంరాజు తన పశువులను ఈ ప్రాంతానికి తరలించాడట. అయితే కనిగిరి ప్రాంతంలో కరువు తొలగిన వెంటనే పుల్లరి చెల్లించేందుకు నిరాకరించిన కాటంరాజు.. తన పశువులను కనిగిరికి తరలించకు వచ్చారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు కాటంరాజుకు చెందిన పశువులలో అత్యంత ప్రాధాన్యం కలిగిన బొల్లి ఆవును ఇవ్వాల్సిందిగా మనుమసిద్ధిరాజు కోడలు కుందుమాదేవి కోరిందట. అయితే దానికి కాటంరాజు తిరస్కరించటంతో ఆగ్రహించిన కుందమదేవి గోవులను చంపించే పనులు చేపట్టడంతో, ఆయన గోవులను కనిగిరికి తీసుకొచ్చేశారని మరో కథనం.

కారణాలు ఏవైనప్పటికీ... కాటంరాజు, మనుమసిద్ధిరాజు యుద్ధానికి తలపడ్డారట. వీరిద్దరూ పాలేటి ఒడ్డున పంచలింగాల కొండవద్ద యుద్దానికి తలపడ్డారట. ఇందుకు సాక్ష్యాలుగా ఇప్పటికీ ఆ ప్రాంతంలో కొన్ని చారిత్రక ఆధారాలు దర్శనమిస్తున్నాయి. ఈ యుద్ధంలో కాటంరాజు విజయం సాధించారు. దాంతో యాదవులు వారి కులదేవత అయిన గంగాదేవి ఆలయాన్ని కాటంరాజుచేత ప్రతిష్టింపజేసి భక్తిప్రపత్తులతో పూజలు జరిపారని శాసనాలు చెబుతున్నాయి.

కాటంరాజు శ్రీ కృష్ణభగవానుడి అంశ అని భావించిన యాదవులు కాటంరాజు ధైర్యసాహసాలను నేటికీ కనిగిరి ప్రాంతంలో కథల్లాగా చెప్పటమేగాక.. గంగాదేవి వెనుకవైపున కాటంరాజు విగ్రహాలు ఉంచి పూజిస్తుంటారు కూడా..! అప్పటి కాటంరాజు పాలనా కాలంనాటి శిల్పాలు, విగ్రహాలు, కాటంరాజు గుడి.. తదితరాలు నేటి కనిగిరి దుర్గంలో శిథిలావస్థకు చేరుకుని మనకు దర్శనమిస్తున్నాయి.

కాటంరాజు తర్వాతి కాలంలో ఉదయగిరిని పరిపాలించిన గజపతుల ఆధీనంలోకి వెళ్లిన కనిగిరి కోట ఎంతగానో అభివృద్ధి చెంది, సరికొత్త నిర్మాణాలతో ముస్తాబయనట్లు పలు చారిత్రక ఆధారాలు వెల్లడి చేస్తున్నాయి. అయితే 1520లలో శ్రీకృష్ణదేవరాయలు కళింగ జైత్రయాత్రలో భాగంగా సుమారు 2 లక్షల సైన్యంతో ఉదయగిరి దుర్గాన్ని చుట్టుముట్టి 18 నెలలపాటు పోరాడి ఎట్టకేలకు విజయం సాధించాడు.

ఆ విజయంలో భాగంగా కృష్ణదేవరాయలు ఉదయగిరితోపాటు కందుకూరు, అద్దంకి, కొండవీడు, కొండపల్లి, నాగార్జునసాగర్ కొండ, బెల్లంకొండ, కనిగిరి దుర్గాలను వశపరచుకున్నాడు. రాయల పాలన అనంతరం విజయనగర సామ్రాజ్య వైభవం పతనావస్థకు చేరుకోసాగింది. విజయనగర రాజుల తర్వాత కనిగిరి దుర్గం రెడ్డి రాజులు, రాజప్రతిధుల పాలనలోకి వెళ్లినట్లు శాసనాలు చెబుతున్నాయి.

ఆ తర్వాత 1972లో మైసుర్ సుల్తాన్ హైదర్ ఆలీ హయాం వచ్చింది. హైదర్ ఆలీ కర్నాటక యుద్దాల్లో పైచేయి సాధించి.. ఆంధ్ర ప్రాంతానికి వచ్చాడు. అయితే అప్పుడే ఆంధ్రప్రదేశ్‌లో బ్రిటిష్ అధికారం కుడా ప్రారంభమయింది. కనిగిరి ఆనాడు ఆధో నవాబు అయిన బసాలతే ఆధీనంలో ఉంది. అయితే 1776లో హైదర్ ఆలీ ఆధోపై దండెత్తి.. ఆ తర్వాత కనిగిరి దుర్గాన్ని వశపరచుకున్నాడు.

FILE
అయితే బ్రిటిష్ పాలకులు ఆధోతో పాటు కనిగిరి ప్రాంతాన్ని హైదర్ ఆలీనుంచి వశపరుచుకున్నారు. అప్పట్టికే టిప్పుసుల్తాన్ కుడా మరణించాడు. ఆయన మరణానంతరం హైదరాబాద్ నిజాం ఆధీనంలోకి వచ్చింది. 1801లో వెలస్లీ సైన్యసహకారపద్దతి వల్ల నిజాం కనిగిరి దుర్గాన్ని బ్రిటిష్ వారికి దారదత్తం చేశాడు

ఆ తర్వాత కొంతకాలం బ్రిటిష్ వారి పాలనలో, మరికొంతకాలం స్వాతంత్య్ర భూమిలో... నెల్లూరు జిల్లాలో కొంతకాలం ఉండి, నేడు ప్రకాశం జిల్లాలో కనిగిరి దుర్గం అంతర్భాగం అయ్యింది. కనిగిరి పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఈ కనిగిరి కోట(దుర్గం) ప్రస్తుతం శిధిలావస్థలో ఉంది. కూలిన కోటగోడలు, ద్వారాలు తప్ప మరేమి ఇక్కడ కపించవు, బురుజులన్నీ పడిపోగా ఉన్న ఒక్క బురుజు కూడా శిధిలావస్దలో ఉంది.

కనిగిరి దుర్గంలో భవనసముదాయాల ఆనవాళ్ళు మిగలగా.. సమాధుల కోసం పునాదులు త్రవ్విన అవశేషాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. కొండమీదగా దుర్గానికి చేరుకోవడాకి సరైన మెట్లు కూడా లేవు. వేలాది సంవత్సారాల క్రితం రాజులు ఏర్పాటుచేసిన మెట్లు శిధిలమై నామమాత్రంగా ఉన్నాయి.

ఈ కోటలో రెండు మంచినీటి చెరువులు, ఒక కోనేరు ఉన్నాయి. కోటి చెన్నమ్మక్క బావిగా కోనేరు ఒకటి వాడుకలో ఉంది. శ్రీకృష్ణదేవరాయులు భార్య రాణి చెన్నమ్మదేవి ఈ కోనేరును నిర్మించినట్లు శాసనాలు ద్వారా తెలుస్తోంది. బావి సమీపంలో విష్ణు ఆలయం ఉంది. అయితే విష్ణువు విగ్రహం మాత్రం కనిపించే పరిస్థితి లేదు. ఇక్కడ ఆలయానికి ఉపయోగించిన రాళ్ళు తప్ప మరేమీ ఉండవు.

ఇక్కడి దుర్గ విగ్రహం క్రింద గుప్తధులు ఉన్నాయని విగ్రహాలను తొలగించిన కందకాలు ఒకవైపు కనిపిస్తుంటాయి. మరోవైపు రాళ్ల మధ్య ఉంచిన దేవతా విగ్రహాలకు కోటను దర్శించేందుకు వెళ్లేవారు, భక్తులు పూజలు చేస్తుంటారు. ఈ ఆలయంపైనగల కొండరాళ్ల మధ్య నీరు ఎక్కడ దొరికినా, దొరకకపోయినా.. మండువేసవిలో సైతం ఇక్కడ నీరు పుష్కళంగా ఉంటుందని చెబుతుంటారు.

ఈ ప్రాంతం నుండి మరో రెండు కిలోమీటర్ల దూరంలో ముందుకు పోతే మందుగుండు సామాగ్రి.. ఆనాటి రాజులు దాచుకున్న నేలమాళిగలు.. ఏనుగులు, గుర్రపుశాలల ప్రదేశాలు, దర్వాజాలు, భీమునిపాదం తదితరాలు దర్శనమిస్తాయి. అయితే అవి శిధిల స్దితిలో చేరి ఆనవాళ్ళుమాత్రమే చూపరులకు కనిపిస్తాయి. ప్రాచీన నాగరికతను, పాశ్చత్య నాగరికత వెనక్కు నెట్టడంతో ఈ దుర్గం ఒంటరిగా మిగిలిపోయింది.

గత వైభవం అంతా నశించి నేడు విగత జీవిగా మారిన కనిగిరి దుర్గం (కోట) గురించి పురావస్తుశాఖ పట్టించుకోవడంలేదనే విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి. ఇక్కడ ఉన్న శాసనాల్లో ఎముందో ఎవరికీ తెలియని పరిస్దితి. ఆ శాసనాల్లోని విషయాలను వెలుగులోకి తేవడంతో పాటు త్రవ్వకాలు జరిపినట్లయితే.. అనేక చారిత్రాత్మక విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది.

గత వైభవానికి సాక్షీభూతంగా నిలిచిన కనిగిరి దుర్గం చరిత్రలో మరుగునపడిపోకుండా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే..! ఇప్పటికైనా కళ్లు తెరచి శిథిలమైపోతున్న మన జాతి సంపదను కాపాడుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని అందరం కోరుకుందాం...!!