బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. ఏపీ టూరిజం
Written By Ganesh

శిల్పకళా సౌందర్యాల కాణాచి "గండికోట"

"రాజులు పోయినా, రాజ్యాలు పోయినా..." వారికి గుర్తుగా ఉన్న గండికోట మాత్రం మిగిలే ఉంది. శ్రీకృష్ణదేవరాయుల కాలంలో ఓ వెలుగు వెలిగిన ఈకోట దాదాపు ఐదు దశాబ్దాలపాటు నాలుగు సామ్రాజ్యాలకు వెన్నుదన్నుగా... హిందూ, ముస్లిం సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా విరాజిల్లింది. శతాబ్దాల కాలంనాటి శిల్పకళా సంపదకు నిలువెత్తు రూపంగా నిలిచిన ఈ గండికోట కాకతీయుల పాలనలోనూ, ఆ తరువాత మీర్ జుమ్లా నవాబు పాలనలోనూ సకల కళా వైభవంతోనూ అలరారింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా, జమ్మలమడుగు తాలూకాలో పెన్నానది ఒడ్డున గల ఒక చిన్న గ్రామమే "గండికోట". ఇక్కడి ఎర్రమల పర్వత శ్రేణినే గండికోట కొండలని కూడా అంటారు. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చినట్లు స్పష్టమవుతున్నది.
పూర్వ వైభవం తెచ్చేందుకు...!
  ఇంతటి చారిత్రక ప్రాముఖ్యం కలిగిన గండికోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందుకుగానూ పది వేల కోట్ల రూపాయలను కేటాయించిన వైఎస్సార్ ప్రభుత్వం, రాబోయే నాలుగేళ్లలో గండికోటను ఎకో టూరిజం ప్రాంతం...      


ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. ఇక్కడి లోయ యొక్క సుందర దృశ్యం వర్ణనాతీతం. దట్టమైన అడవులు, మనోహరంగా కనిపించే భూతలం మధ్య ఎంతటి బలమైన శతృవుదాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉంది. చుట్టూ లోతైన లోయలతో, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన దుర్బేధ్యమైన కొండలతో, 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నదితో, కోట లోపలి వారికి బలమైన, సహజసిద్ధమైన రక్షణ కవచమేర్పడింది.

గండికోట ప్రాకారంలోని కొంత భాగం వృత్తాకారంలో ఉండే కోట చుట్టుకొలత దాదాపు ఐదు మైళ్ళుంటుంది. కోట ముఖద్వారానికి ఎత్తైన కొయ్య తలుపులు ఇనుప రేకుతో తాపడం చేయబడి, ఆ తలుపులపై ఇనుప సూది మేకులను ఏర్పాటు చేశారు. కోట ప్రాకారం ఎర్రటి నున్నని శాణపు రాళ్ళతో నిర్మించారు. కొండ రాతి పై పునాదులు లేకుండా గోడలు నిర్మించారు. ఈ గోడలు 10 నుండి 13 మీటర్ల ఎత్తున్నాయి. చతురస్రాకారంలోను, దీర్ఘ చతురస్రాకారంలోను 40 బురుజులున్నాయి. గోడపై భాగాన సైనికుల సంచారం కోసం 5 మీటర్ల వెడల్పుతో బాట ఉంది.

కోట అంతర్భాగంలో మాధవరాయ, రంగనాథ ఆలయాలున్నాయి. ముస్లిం నవాబుల కాలంలో ఈ ఆలయాలను ధ్వంసం చేశారు. ఆనాటి శిధిల శిల్పాలు ఇప్పటికీ మనకు దర్శనమిస్తాయి. మీర్ జుమ్లా జామా మసీదును సుందరంగా నిర్మించాడు. కోటలో పెద్ద ధాన్యాగారము, మందుగుండు సామగ్రి గిడ్డంగి, పావురాల గోపురం, మీనార్లు ముఖ్యమైన కట్టడాలు. ఇంతే గాక జైలు, రంగ్ మహల్ ఉన్నాయి. నీటి వసతి కోసం రాజుల చెరువు, కత్తుల కోనేరు, ఇంకా చాలా చెరువులు, బావులున్నాయి. భూమి అడుగున గొట్టం ద్వారా ఏర్పరచిన నీటి సదుపాయం ఇక్కడి ప్రత్యేకత.

గతంలో ఈ కోటలో సుందరమైన, ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, తోటలు ఉండేవి. పెమ్మసాని నాయకులు గండికోటను జనరంజకంగా పాలించినట్లు ప్రతీతి. ఇప్పుడు గండికోటలోని శిథిలాలు, మిగిలి ఉన్న కట్టడాలు ఈ కోట గత వైభవానికి ప్రతీకలుగా నిలిచి ఉన్నాయి.

గండికోట జమ్మలమడుగు నుంచి పడమరగా దాదాపు ఆరు మైళ్ళ దూరంలో ఒక పర్వత శ్రేణిపై ఉన్నది. పెన్నా నదీ ప్రవాహం ఇక్కడి కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వల్ల ఈ కోటకు గండికోట అని పేరు వచ్చినది. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా పెన్నా నదీ ప్రవాహం సాగే నాలుగు మైళ్ళ పొడవునా ఈ గండి ఏర్పడి ఉంది. నదికి దక్షిణతీరాన ఉవ్వెత్తున ఎగసిన కొండల మీద బ్రహ్మాండమైన రక్షణ గోడలున్నాయి.

ఇక్కడ చూడదగిన ప్రదేశాల విషయానికి వస్తే... గండికోటలోపల ఉండే మాధవరాయ ఆలయం, రంగనాథ ఆలయాలు చెప్పుకోదగ్గవి. మాధవరాయ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన క్రీ.శ. పదహారవ శతాబ్దానికి చెందిన శాసనాలలో కనిపిస్తుంది. ఆలయంలో మనకు కనిపించే శిల్ప కళా లక్షణాలు, ఆలయనిర్మాణశైలిని బట్టి చూసినా ఆలయ నిర్మాణం అదే కాలంలో జరిగినట్లు తోస్తుంది. ఆలయనిర్మాణాన్నీ, అందలి శిల్పకళారీతుల్నీ, వాటి లక్షణాలనూ విశదంగా అధ్యయనం చేసిన మీదట ఈ ఆలయాన్ని క్రీ.శ.పదహారవ శతాబ్దం తొలినాళ్ళలో (దాదాపుగా 1501-1525 మధ్యకాలంలో) నిర్మించినట్లు చెప్పవచ్చు.

ఇక రంగనాథ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన శా.1479 (క్రీ.శ.1557) నాటి ఒక శాసనంలో కనిపిస్తుంది. ఆ శాసనం గండికోటలోని రంగనాయకుని గుడికి భూమిని మాన్యంగా ఇచ్చినట్లు తెలుపుతుంది. ఈ ఆలయ నిర్మాణశైలిని బట్టి చూస్తే రంగనాథ ఆలయం నూటికి నూరు పాళ్ళూ విజయనగర రాజుల నిర్మాణమేనని స్పష్టమౌతుంది. ఈ ఆధారాలను బట్టి ఈ ఆలయాన్ని క్రీ.శ. 15 శతాబ్దంలో నిర్మించినట్లుగా చెప్పవచ్చు.

ఇంతటి చారిత్రక ప్రాముఖ్యం కలిగిన గండికోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయించారు. ఇందుకుగానూ 10 వేల కోట్ల రూపాయలను కేటాయించిన ప్రభుత్వం, రాబోయే నాలుగేళ్ల కాలంలో ఎకో టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించింది.

ఈ ప్రాంతంలో 2వేల ఎకరాలలో సైన్స్‌సెంటర్, ఎంటర్‌టైన్‌మెంట్‌పార్కు, లైట్‌షో, ఫిల్మ్‌సిటీ, నాలెడ్జ్ సిటీ తదితర సౌకర్యాలు కలిగిన సముదాయాలను నిర్మించనున్నారు. అలాగే యాత్రికులు బస చేసేందుకు వసతి సౌకర్యాలను నిర్మిస్తున్నారు. గండికోట ప్రస్తుతం జిల్లాలో పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. పాడుబడ్డ గుర్రపుశాలలు, రాణి ఆవాసాలులాంటివి నేటికీ ఇక్కడ దర్శనమిస్తున్నాయి.