శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By ఎం
Last Updated : శనివారం, 31 జులై 2021 (09:51 IST)

మరణించువారి లక్షణములు ముందుగా తెలుసుకోవడం ఎలా?

రోగులకు చికిత్స చేయు క్రమములో కొన్ని రకాల తీవ్రమైన జబ్బులు ఔషధములతో ఎంత ప్రయత్నించినను లొంగవు . అటువంటప్పుడు ఆ రోగి మరణమును తప్పక పొందును.  మరణము సమీపించునకు మునుపే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఏర్పడి రాబోవు మరణమును సూచించును.

వీటిని అయుర్వేదము నందు అరిష్టములు అందురు. ఇటువంటి ప్రత్యేక లక్షణములను ఎంతో అనుభవము కలిగిన వైద్యులు మాత్రమే పసిగట్టగలరు. ఈ లక్షణములు వైద్యులు రహస్యముగానే ఉంచెదరు. 
 
మరణ అరిష్టములు  - 
*  కామెర్ల రోగములో వలే కళ్లు పచ్చగా ఉండి ముఖం , దవడలు మాంసముతో నిండి ఉండి రోగి భయముతో ఉండి శరీరం జ్వరం ఉన్నవాని వలే ఉండిన అరిష్టము. 
 
*  మంచము మీద నుంచి లేవనెత్తిన వెంటనే మూర్చపోతాడు. ఎప్పుడు లేపినను ఇదే పరిస్థితి ఉండును. ఇట్టివాడు 7 దినములలో మరణించటం తథ్యం . 
 
 *  శరీరం నందు కొన్ని రోగాలు పైభాగము నందు , కొన్ని కింద భాగము నందు ప్రభావము చూపించును. అందు గ్రహణి అను రోగం అత్యంత తీవ్రము అయిన ఆ రోగి 15 దినముల కంటే ఎక్కువ బ్రతకడు . 
 
 *  పురాణరోగం పీడిస్తూ తిండి తక్కువ తింటూ అంతకు మించి మలమూత్రాదులు ఉన్నరోగి బ్రతుకుట దుర్లభం. 
 
 *  శరీరం కండ లేకుండా దుర్బలముగా ఉండి తిండి అధికంగా తినడం మరికొంత సమయం అవ్వగానే మరలా తినడం అరిష్టం. 
 
 *  ఇష్టము, బలవర్థకం, సర్వగుణ సంపన్నం అయిన ఆహారం తినుచున్ననూ రోజురోజుకి శరీరం క్షీణించువాడు బ్రతకడు. 
 
 *  మూలగడం, ఆగి ఆగి ఆయసం రావడం, అతిసార రోగం, బలం ఉండదు, తీవ్ర దప్పిక, నోరు ఎండుకొని పోవడం వంటి లక్షణాలు అరిష్టం. 
 
 *  నేత్రములు పైకి పోవడం, కంఠం ఇరువైపులా ఉండు సిరలు ఆగకుండా కంపించడం, బలహీనత, దప్పిక, శరీరం ఎండుకుపోవడం వంటి లక్షణాలు అరిష్టం. 
 
 *  శిరస్సు, నాలిక, ముఖం తిరిగిపోవడం, కనుబొమ్మలు వాలిపోవడం, నాలిక మీద రుచిమొగ్గలు ముళ్ళు వలే పైకి తేలి ఉండటం వంటి లక్షణాలు అరిష్టం. 
 
 *  శిశ్నము పూర్తిగా లోపలికి పోయి వృషణములు కిందకి జారి బయటకి వచ్చినట్టు కనిపించినను లేక వృషణములు లోపలికి వెళ్లి శిశ్నము బయటకి వచ్చినట్టు కనిపించినను అరిష్టము. 
 
 *  మాంసం పూర్తిగా నశించి చర్మం , ఎముకలు మాత్రమే మిగిలి అస్థిపంజరంలా మారినవాడు 30 దినములలోపు మరణించును. 
 
 *  రెప్పలు వాచిపోయి దగ్గరకు రావు. శరీరం కృశించి, కండ్లు మకిలి, మాలిన్యము నిండి ఉండటం అరిష్టం. 
 
 *  రోగము సంభవించినను, సంభవించకున్నను ఎవ్వరి తలవెంట్రుకలు పట్టి లాగినను వానికి ఎంతమాత్రం నొప్పి తెలియకుండా ఉండునో వాడు 6 దినములలో తప్పక చచ్చును. 
 
 *  తలవెంట్రుకలుకు చమురు రాయకున్నను రాసినట్టుగా చమురుతో తడిచిన విధముగా ఉండునో వాడు జీవించడు. 
 
 *  శరీరం చిక్కిపోతున్ననూ ముక్కు దూలం మాత్రం కండతో బలంగా ఉండి శరీరం ఉబ్బురోగం లేకున్ననూ ఉబ్బినట్టుగా ఉన్నను అరిష్టం. 
 
 *  నాసారంధ్రములు పూర్తిగా మూసుకొని పోయినను, విశేషముగా తెరచుకొని ఉన్నను, వంకర పోయినను, ఎండిపోయినను ఆ రోగి బ్రతకడు. 
 
 *  దీర్ఘముగా ఊపిరి విడుస్తూ మరలా వెంటవెంటనే వాయువును లోపలికి తీసుకుంటూ మిగుల వేదనను అనుభవించువాడు జీవించడు. 
 
 *  మోకాలుతో మోకాలును చేర్చి వాయించుతూ రెండు పాదములను పైకి ఎత్తి గభాలున మంచం మీద వదులువాడు, సర్వదా ముఖమును అటుఇటు కదిలించుట అరిష్టం. 
 
 * గోళ్లను దంతాలతో కొరుక్కోవడం, తలవెంట్రుకలును గోళ్లతో పట్టి తెంచుకొనుట, కర్రపట్టి నేలమీద గీయుట అరిష్టం. 
 
 *  మేల్కొన్న సమయములో దంతాలు కోరుకుట, బిగ్గరగా ఏడవడం మరలా అంతలోనే నవ్వడం వంటి లక్షణాలు కలిగి ఉన్నవాడికి వాడి శరీరంలో బాధలు వాడికే తెలియవు. ఇది అరిష్టం. 
 
 *  అతిగా నవ్వడం, కటకటమని శబ్దం చేయుట సకిలిస్తాడు, పాదాలతో మంచాన్ని కొట్టువాడు, ముక్కులు, చెవులు, కండ్లు వంటి రంధ్రములలో వ్రేళ్లు దూర్చుట అరిష్టం. 
 
 *  శిరస్సు బరువైపోయి మోయలేక కంఠం ఒకవైపుకు వాలిపోవడం, శరీరం బరువు మోయలేక నడుము వంగిపోవడం, అన్నం నోట్లో పెట్టిన దౌడలు వ్రేలాడిపోయి అన్నం జారిపోవడం అరిష్టం. 
 
 *  తెల్లవారుజామున ముఖం పైన చెమట పడుతూ ఉండును. ఇట్టి జ్వర పీడితుడు జీవించడు. 
 
 *  శ్లేష్మరూపం అయిన కళ్లే, మలము, శుక్రము ఇవి తేలిక పదార్దాలు అగుట చేత నీటిలో తేలును. కాని ఏ రోగి సంబంధం అయిన ఈ మూడు నీటిలో వేసిన మునిగిపోవునో ఆ రోగి జీవించడు. 
 
పైన చెప్పిన లక్షణాలు ఒక్కో రోగిలో ఒక్కోలా ఉంటాయి. ఎంతో అనుభవం ఉన్న వైద్యుడు మాత్రమే ఆయా లక్షణాలను సరిగ్గా అంచనా వేయగలడు.