శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (12:21 IST)

శ్రావణి ఆత్మహత్య కేసు: ‘ప్రేమ పేరుతో వాడుకున్నారు, పెళ్లనేసరికి ఇతరులతో సంబంధాలు అంటగట్టారు’ - ప్రెస్‌రివ్యూ

టీవీ నటి శ్రావణి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురించింది. ‘‘ప్రేమ పేరుతో వాడుకొన్నారు. పెళ్లి విషయానికి వచ్చేసరికి ఒకరికి తెలియకుండా మరొకరు ఆమెకు ఇతరులతో సంబంధాలు అంటగడుతూ మానసికంగా వేధించారు. ఇది భరించలేకే టీవీ నటి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు.

 
ఈ కేసులో సోమవారం ఇద్దరు నిందితులను ఎస్సార్‌నగర్‌ పోలీసులు అరెస్టుచేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ కేసు వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 22న శ్రావణి తన ఫ్రెండ్‌ సమీర్‌ బర్త్‌ డే పార్టీలో తాను దేవరాజ్‌రెడ్డిని పెళ్లి చేసుకుంటున్నానని ప్రకటించింది.

 
దీనిపై స్పందించిన దేవరాజ్‌రెడ్డి.. ‘నీకు అశోక్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డితో సంబంధాలు ఉన్నాయి’ అంటూ నిరాకరించాడు. కాగా, శ్రావణి తనకు ఎవరితో సంబంధాలు లేవంటూ దేవరాజ్‌రెడ్డిని చాటింగ్‌ ద్వారా సముదాయిస్తూనే ఉంది. సెప్టెంబర్‌ 7న రాత్రి దేవరాజ్‌రెడ్డి శ్రావణిని ఓ హోటల్‌కు డిన్నర్‌కు తీసుకెళ్లాడు.

 
అక్కడికి సాయికృష్ణారెడ్డి వచ్చి దేవరాజ్‌తో గొడవ పడి, శ్రావణిని కొట్టి ఆటోలో ఇంటికి తీసుకెళ్లాడు. తనను కుటుంబసభ్యులు, అశోక్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని శ్రావణి ఫోన్‌లో దేవరాజ్‌రెడ్డికి చెప్పింది.

 
సెప్టెంబర్‌ 8న రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. శ్రావణి ఆత్మహత్యకు దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డి కారణమని విచారణలో పోలీసులు తేల్చార’’ని నమస్తే తెలంగాణ వివరించింది.