శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. అటవీ అందాలు
Written By Ganesh

ఊటీని తలపించే సౌందర్యం "కల్రాయన్ కొండల" సొంతం..!!

FILE
పర్వత శ్రేణుల నడుమ వయ్యారంగా ప్రవహించే గోముఖీ నది, దట్టమైన అడవి మధ్యలో సెలయేటి చప్పుళ్ళు, ఆహ్లాదాన్నిచ్చే పెరియార్, మేఘం జలపాతాలు, నిటారుగా దర్శనమిచ్చే కల్రాయన్ పర్వత శిఖరాలు, అడుగడుగునా ఆహ్లాదపరిచే ప్రాంతాలు, పురాతనమైన కట్టడాల శోభతో... పర్యాటకులకు మరచిపోలేని అనుభూతులను అందిస్తున్న దర్శనీయ స్థలం "విల్లుపురం".

విల్లుపురం ప్రకృతి సౌందర్యాన్ని ఎంతసేపు చూసినా, ఎన్నిసార్లు తిలకించినా తనివితీరదంటే అతిశయోక్తి కాదు. తమిళనాడు రాష్ట్రంలో రెండో అతిపెద్ద జిల్లా అయిన విల్లుపురం.. తిరుచ్చి-చెన్నై హైవేలో జిల్లా కేంద్రంగా విరాజిల్లుతోంది. కనువిందు చేసే పచ్చటి కొండలు, చారిత్రాత్మకమైన ప్రాచీన నిర్మాణాలు, ఆలయాలు, చర్చిలు, మసీదులు, కోటలు, రాజమందిరాలు.. ఇలా ఒకటేమిటి, అనేక పర్యాటక ప్రదేశాలను కలిగి ఉన్న ఈ ప్రాంతానికి బస్సు, రైలు సౌకర్యాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాయి.

విల్లుపురంలో ముఖ్యంగా చూసి తీరాల్సినవి "కల్రాయన్ కొండలు". కళ్లకుర్చి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే కల్రాయన్ కొండల అందాలను చూసి తరించేందుకు కళ్లకుర్చి నుంచి బస్సులు నడుస్తున్నాయి. సముద్ర మట్టం నుంచి 3,500 కిలోమీటర్ల ఎత్తులో ఉండే పశ్చిమ కనుమలలో కొలువుదీరిన కల్రాయన్ కొండలు ఊటీని తలపించే చల్లటి వాతావరణంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
రాయలవారు దానమిచ్చారట..!
విల్లుపురంలో సుమారు 600 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించిన కల్రాయన్ కొండ ప్రాంతాన్ని విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు కాంచీపురం నుంచి వలస వచ్చిన "కర్‌లర్" అనే గిరిజన తెగవారికి దానంగా ఇచ్చారని చరిత్ర చెబుతోంది. రాయలవారి హయాంలో నిర్మించిన...


దట్టమైన అడవి, సెలయేళ్ల పరుగులు, వనమూలికావనం, గోముఖీ నది పర్యాటకులను పరవశింపజేస్తున్నాయి. రాష్ట్ర పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన ఎకో టూరిజం స్పాట్లు కూడా పర్యాటకులకు ప్రకృతిమధ్య ఆహ్లాదంతోపాటు, సేదదీర్చే కేంద్రాలుగా ఉన్నాయి. కల్రాయన్ కొండల్లో పలు ప్రాంతాల్లో జలపాతాలున్నప్పటికీ, వాటిలో కొన్నింటిలో మాత్రమే స్నానాలు చేసేందుకు వీలవుతుంది.

మరో చెప్పుకోదగ్గ పర్యాటక ప్రాంతం "పెరియార్ జలపాతం". గోముఖీ డ్యాం నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ పెరియార్ జలపాతం ఉంది. గోముఖీ డ్యాం-కరియలూర్‌కు బస్సుమార్గంలో వెళితో ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు. రోడ్డుప్రక్కనే ఉన్న ఈ జలపాతంలో హాయిగా స్నానం చేయవచ్చు. ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో కరియలూర్ ఉంటుంది. పెరియార్ జలపాతం నుంచి కరియలూరుకు వెళ్లే మార్గంలో పచ్చని కొండ ప్రాంతాలు కనువిందు చేస్తాయి. ఇక్కడ పర్యాటకుల కోసం విడిది గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

పెరియార్ జలపాతం నుంచి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే వెల్లిమలైకి చేరుకోవచ్చు. అక్కడినుంచి మరో ఐదు కిలోమీటర్ల దూరం వెళితే సంవత్సరమంతా పుష్కళంగా నీరు లభించే "మేఘం జలపాతం" దర్శించవచ్చు. అయితే ఈ జలపాతంలో స్నానం చేసేందుకు మాత్రం వీలుపడదు. తగినంత వసతులు లేని ఈ జలపాతాన్ని చూసి తరించాల్సిందే తప్ప, దిగి స్నానం మాత్రం చేయలేము.

FILE
కల్రాయన్ కొండల్లోనే అత్యంత ఎత్తైన కొండ ప్రాంతం "ఇన్నాడు" మరో చూడదగ్గ ప్రాంతం. సముద్ర మట్టం నుంచి సుమారు 3,500 కిలోమీటర్ల ఎత్తులో కొలువుదీరిన ఈ కొండ నుంచే.. కల్రాయన్ పరిధిలోని పోలీసుశాఖ, రవాణా శాఖలకు సమాచారం చేరవేస్తుంటారు. ఇన్నాడు రిపీటర్ కేంద్రం నుంచే విల్లుపురం, కడలూరు, తిరువణ్ణామలై, వేలూరు తదితర జిల్లాల పోలీసు శాఖల వైర్‌లెస్ పరికరాలను నియంత్రింపజేస్తుంటారు కూడా. అంతేగాకుండా.. రవాణా సంస్థ వైర్‌లెస్ పరికరాలను సైతం ఇక్కడి నుంచే నియంత్రిస్తుంటారు.

చారిత్రక ప్రాధాన్యం కూడా కలగలిసిన విల్లుపురంలో ప్రాచీన కోట అయిన "జింజికోట"ను తప్పక దర్శించాల్సిందే. మూడు కొండలపై నిర్మితమైన ఈ జింజికోటను.. విజయనగర పాలకులు నెల్లూరును పరిపాలించిన కాలంలో రాజధానిగా చేసుకుని పాలించారు. కృష్ణగిరి, చక్కిలిదుర్గ, రాజగిరి అనే కొండలు ముక్కోణం ఆకారంలో వెలిశాయి. వాటిపై జింజికోటను అద్భుత శిల్పకళా నైపుణ్యంతో నిర్మించారు. ఈ కోటలో ఇండో-ఇస్లామిక్ రీతిలో నిర్మించిన కళ్యాణ మండపం విశేషంగా ఆకట్టుకుంటుంది.

కోట ముఖద్వారం వద్ద నిర్మించిన వేణుగోపాల స్వామి ఆలయం నేటికీ పూజలందుకుంటోంది. హనుమాన్ ఆలయం, రంగనాథ్ దేవాలయం, ఉల్లాఖాన్ మసీదు, కమలకన్ని ఆలయాలను మొగల్ చక్రవర్తులు, విజయనగరరాజులు ఇక్కడ నిర్మించారు. 1012లో రాజేంద్ర చోళుడు నిర్మించిన రామనాథ ఈశ్వరాలయం, బ్రహ్మ ఇస్లాం ఆలయంగా ప్రసిద్ధి చెందింది.

విల్లుపురానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువాక్కరైలోని "నేషనల్ జియోలాజికల్ పార్క్" చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశం. ఈ పార్కు వేలాది రకాల చెట్లతో అందరినీ ఆకర్షిస్తోంది. దీనికి దగ్గర్లోనే చోళ చక్రవర్తుల పాలనలో సెంబియాన్ మహదేవర్ అనే మహారాణి శివాలయాన్ని నిర్మించారు. శ్రీ చంద్రమౌళీశ్వరుడు తనాంబిక తీరంలో శ్రీ వక్రలింగేశ్వరుడు, వక్రకాళి అమ్మవారితో కొలువుదీరారు.

ఇక చివరిగా... విల్లుపురంలో సుమారు 600 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించిన కల్రాయన్ కొండ ప్రాంతాన్ని విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు కాంచీపురం నుంచి వలస వచ్చిన "కర్‌లర్" అనే గిరిజన తెగవారికి దానంగా ఇచ్చారని చరిత్ర చెబుతోంది. రాయలవారి హయాంలో నిర్మించిన కట్టడాలు అనేకం నేటికీ విల్లుపురంలో దర్శనమిస్తుండటం దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు.