శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. అటవీ అందాలు
Written By Ganesh

నిన్నలేని అందమేదో నిదుర లేచెనెందుకో....!

FILE
ఒకవైపు కారుమబ్బులు, అంతలో చల్లగా వీస్తూ శరీరాన్ని రాసుకుంటూ పోయే పిల్లగాలి, అక్కడే జుమ్మని నాదం చేస్తూ తిరిగే తుమ్మెదలు.. రకరకాల రంగులతో, సువాసనలు వెదజల్లుతూ నవ్వుతూ పలుకరించే పుష్పాలు, ఇంతలో మేమున్నామని గుర్తు చేస్తూ కురిసే వర్షపు చినుకులు, వర్షానికి తడిసిన భూమాత మట్టి సువాసన... ఇవన్నీ మనసును దోచేవే. వీటికి భాష లేకపోయినా, వాటి లక్షణాలను బట్టి తన్మయత్వం చెందని హృదయమనేది ఉండదు. ఇంతటి ప్రకృతి సౌందర్యాన్ని తనలో దాచుకున్న కొడైకెనాల్ అందచందాలను వర్ణించాలంటే మాటలు చాలవు.

కొడైకెనాల్... తూర్పు కనుమల, కొండల వరుసలలో ఉండే ఓ అందమైన ఒక హిల్‌ స్టేషన్. సంవత్సరం పొడవునా పర్యాటకులు వచ్చే అందమైన ప్రదేశం యిది. సీజన్‌లో వస్తే ఇక్కడి మనోహర దృశ్యాలను అందమైన ప్రకృతి లావణ్యాన్ని తనివితీరా ఆస్వాదించవచ్చు. సాధారణంగా మార్చి నుంచి ఆగస్టు నెల వరకు సీజన్ కొనసాగుతుంది. సెప్టెంబర్ నెలలో ఆఫ్ సీజన్ ప్రారంభమవుతుంది.

తమిళనాడు రాష్ట్రానికి.. దాదాపు నడిబొడ్డుకు దగ్గరగా ఉండే ఈ కొడైకెనాల్‌కు దక్షిణంగా 120 కిలోమీటర్ల దూరంలో మధురై.. పడమట 64 కిలోమీటర్ల దూరంలో పళని, ఉత్తరంగా 99 కిలోమీటర్ల దూరంలో దిండిగల్ ప్రాంతాలు ఉన్నాయి. కొండ ప్రాంతం కాబట్టి ఘాట్ రోడ్డులో ప్రయాణించినట్లయితే మధురై నుంచి సుమారు నాలుగు గంటలు, పళని నుంచి రెండు గంటలు, దిండిగల్ నుంచి మూడున్నర గంటల బస్సు ప్రయాణం ద్వారా కొడైకెనాల్‌కు చేరుకోవచ్చు.
బహు సుందరం.. "హైవేవిస్"
ట్రిప్లికేన్ ప్రాంతంలోగల "హైవేవిస్" కూడా తమిళనాడు రాష్ట్రంలో చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశం. మంచుతో మిన్నంటుతున్న శిఖరం, పచ్చనైన తేయాకు తోటలు, కొండ సమీపంలో చెరువులోకి నడచి వెళ్లేందుకు కొండ మధ్య భాగంలో రహదారి, ఆనకట్ట... ఇవన్నీ కలగలసిన రమ్యమైన స్థలమే...


ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ప్రకృతి అందాల కొడైకెనాల్‌లో విదేశాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శించారు. ఈ ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడూ చల్లటి గాలులు వీస్తుంటాయి. దీంతో ఈ వాతావరణంలోని హాయిని అనుభవిస్తూ, సేద తీరేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు.

కొడైకెనాల్‌ ప్రాంతంలో ఈ నెలలో ప్రారంభమైన ఆఫ్ సీజన్‌ ప్రారంభంలో... బ్రెన్ పార్కు, చెరువు, కురింజి ఆండవర్ ఆలయం తదిర ప్రాంతాలను పర్యాటకులు పెద్ద ఎత్తున సందర్శిస్తున్నారు. ఇక్కడి పార్కుల్లో వికసించిన పుష్పాల అందాలను చూసేందుకు రెండు కళ్లు సరిపోవటం లేదని, అలాగే ఇక్కడి చల్లటి వాతావరణంలో సేద తీరటం ఒక అనిర్వచనీయమైన అనుభూతికి గురిచేస్తోందని పలువురు పర్యాటకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కూడా..!

FILE
ఈ ప్రాంతంలో ముఖ్యంగా 1863వ సంవత్సరంలో కట్టబడిన మానవ నిర్మితమైన కొడై సరస్సు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. సుమారు 60 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ సరస్సు ఒకవైపు అరచేతి మాదిరిగా వెడల్పుగా ఉండి, మరోవైపు చేతివేళ్ల మాదిరిగా సన్నటి పాయల్లాగా ఉంటుంది. ఇందులో బోటు షికారు కూడా చేయవచ్చు.

అలాగే మరో ముఖ్యమైన ప్రదేశం "కొడై సరస్సు కోకర్స్ వాక్". కొండ అంచున సన్నగా, పొడుగ్గా ఉండే కాలిబాటే ఇది. ఈ బాట వెంబడి నడుచుకుంటూ వెళితే చుట్టూ కనిపించే ప్రకృతి దృశ్యాలకు మన కళ్లను అప్పగించేస్తామంతే..! ఇంకో చూడదగ్గ ప్రాంతం "సెయింట్ మేరీ చర్చి". సుమారు 150 సంవత్సరాలకు పూర్వం ఈ ప్రాంతంలో నిర్మించబడ్డ మొట్ట మొదటి చర్చి ఇది.

FILE
కొడైకెనాల్ పట్టణానికి చివర్లో ఉండే "పంపార్ జలపాతం" అందం వర్ణణాతీతం. ఎత్తుపల్లాలతో ఉన్న రాతినేల మీద ప్రవహిస్తూ ఉండే సన్నటి వాగు ఇది. విశాలమైన లోయ, పచ్చని చెట్లతో కూడిన పర్వతాలను.. ఓ కొండ అంచున నిలబడి చూసే అవకాశాన్నిచ్చే "గ్రీన్ వ్యాలీ" మరొకటి.

అలాగే స్థానికులు "దయ్యాల గుహ" అని ప్రేమగా పిలుచుకునే "గుణ గుహ".. ఒక కిలోమీటర్ విస్తీర్ణంలో దట్టంగా... కేవలం మంచు, చలి ఉండే కొండ ప్రాంతాలలో మాత్రమే పెరిగే ఫైన్ వృక్ష సముదాయం.. దట్టమైన చెట్లతో కూడి ఉండే విశాలమైన లోయ అయిన "శాంతి లోయ".. కొడైకెనాల్ పరిసర ప్రాంతాలలో పుష్కరానికి ఒకసారి మాత్రమే పుష్పించే "కురింజ పొదల"కు పేరైన ప్రాంతమైన "కురింజి ఆండవర్ ఆలయం" అనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం... తదితరాలన్నీ కూడా చూడదగ్గ పర్యాటక ప్రాంతాలే...!

ఇక్కడికి చేరుకోవటం ఎలాగంటే... మధురై, కోయంబత్తూర్, తిరుచురాపల్లిలకు విమానం ద్వారా చేరుకుని.. అక్కడినుంచి ట్యాక్సీలలో కొడైకెనాల్ చేరుకోవచ్చు. ఇక రైలు మార్గం ద్వారా అయితే.. మధురై వెళ్లే ఏ రైలులో అయినా ప్రయాణించి కొడై రోడ్డు స్టేషన్‌గానీ, దిండిగల్ స్టేషన్‌గానీ చేరుకుని.. అక్కడినుంచి ట్యాక్సీలలో ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.

ట్రిప్లికేన్ ప్రాంతంలోగల "హైవేవిస్" కూడా తమిళనాడు రాష్ట్రంలో చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశం. మంచుతో మిన్నంటుతున్న శిఖరం, పచ్చనైన తేయాకు తోటలు, కొండ సమీపంలో చెరువులోకి నడచి వెళ్లేందుకు కొండ మధ్య భాగంలో రహదారి, ఆనకట్ట... ఇవన్నీ కలగలసిన రమ్యమైన స్థలం "కుమాచ్చి కొండ".

కడల్‌మడం నుంచి 8 వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ కొండను బ్రిటీష్‌వాళ్లు కనుగొని "హైవేవిస్" అని నామకరణం చేశారట. దాంతో అప్పటినుంచి ఆ ప్రాంతం హైవేవిస్‌గా పిలువబడుతోంది. ఈ ప్రాంతం చుట్టుప్రక్కల ఉండే గార్డెన్, మేఘమలై, మణలారు, వెన్నియారు, మేల్‌మణలారు, ఇరవంగలార్, మహారాజా మెట్టు ప్రాంతాలు రమణీయంగా దర్శనమిస్తాయి.

కొండ అడుగు ప్రాంతంలో మేల్‌మనలారు, వట్టప్పారై, వెన్నియారు, ఇరంగలార్ వంతెన, మహారాజా మెట్టులోని మహారాశి అమ్మవారి ఆలయం.. తదితరాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రాంతం చేరుకోవాలంటే.. తేని నుంచి ఒక ప్రభుత్వ బస్సు, ఇతర ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి.

అయితే ఇక్కడ బస, ఆహార సదుపాయం లాంటి ఇతర సదుపాయాలు ఏవీ లేకపోవటం మూలాన పర్యాటకులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. పర్యాటకులకు అనువుగా ఈ హైవేవిస్‌ను రూపొందించినట్లయితే... రాష్ట్రంలో ఇది కూడా ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందగలదని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.