మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2020 (11:38 IST)

దేశంలో మరో 52 వేల పాజిటివ్ కేసులు - 18 లక్షలు క్రాస్

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. తాజాగా మరో 52 వేల పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18 లక్షలు దాటిపోయాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 52,972 మందికి కొత్తగా కరోనా సోకింది. అదేసమయంలో 771 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
 
ఇకపోతే, దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 18,03,695కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 38,135కి పెరిగింది. 5,79,357 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 11,86,203 మంది కోలుకున్నారు.
 
కాగా, ఆదివారం వరకు మొత్తం 2,02,02,858 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)  తెలిపింది. ఆదివారం ఒక్కరోజులో 3,81,027 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.
 
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 983 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదేసమయంలో 11 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.  
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 67,660కి చేరింది. ఆసుపత్రుల్లో 18,500 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 48,609 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 551కి చేరింది. జీహెచ్‌ఎంసీలో 273 మందికి కొత్తగా కరోనా సోకింది. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 73 కేసులు నమోదయ్యాయి.