శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 డిశెంబరు 2020 (10:37 IST)

దేశంలో కొత్తగా 35 వేల కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కొత్తగా మరో 35 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  భారత్‌లో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. గత 24 గంటల్లో 35,551 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 95,34,965కి చేరింది. ఇక గత 24 గంటల్లో 40,726 మంది కోలుకున్నారు.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 526 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,38,648కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 89,73,373 మంది కోలుకున్నారు. 4,22,943 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 14,35,57,647 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,11,698 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
మరోవైపు, తెలంగాణాలో కూడా గత 24 గంటల్లో 609 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 873 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,71,492కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,61,028 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,465కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 8,999 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
 
వారిలో 6,922 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 114, రంగారెడ్డి జిల్లాలో 48 కరోనా కేసులు నమోదయ్యాయి.