శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : శనివారం, 11 జులై 2020 (20:33 IST)

ఆ నాలుగూ లేకుంటే కరోనా మందు ఇవ్వరు..!

రెమ్డిసివిర్, టోసిలిజ్యూమాబ్ మందుల బ్లాక్ విక్రయాలను అడ్డుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

కరోనా పేరుతో కొందరు చౌకధరకు ఈ మందును కొని అధిక ధరకు అమ్ముకుంటూ లాభాలను గడిస్తున్నారని, ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే కొత్త నిబంధనల ఉద్దేశ్యమని, దీని ద్వారా కరోనా ఔషధాల విక్రయాలపై గట్టి నిఘా పెట్టొచ్చని మహారాష్ట్ర మంత్రి రాజేంద్ర షింగే వ్యాఖ్యానించారు.

ఇంతకీ ఆ మార్గదర్శకాలేమిటంటారా?.. కరోనా రోగి బంధువులు లేదా రోగికి సేవ చేసే వారెవరైనా మందుల దుకాణాల్లో రెమ్డిసివిర్, టోసిలిజ్యూమాబ్ కొనాలంటే ఇకపై తప్పనిసరిగా రొగి కరోనా రిపోర్ట్ చూపించాల్సిందే.

కరోనా రిపోర్టుతో పాటు రోగి ఇచ్చిన కన్సెంట్ ఫారమ్, ఆథార్ కార్డు, డాక్టర్ ఇచ్చిన మందుల చీటీ కూడా రెమ్డిసివిర్ కొనేందుకు తప్పనిసరి చేసింది. అయితే కొందరు డాక్టర్లు మాత్రం ప్రభుత్వ నిర్ణయం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 
 
కరోనా వైరస్ చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్ అసలు ధర రూ. 5,400 కాగా, ఒక్కో వయల్‌ను రూ. 20 వేలకు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులకు మహారాష్ట్రలోని థానే పోలీసులు అరదండాలు వేశారు.

ఔషధాన్ని అత్యధిక ధరకు విక్రయిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు సాయిబాబా నగర్ ప్రాంతానికి చెందిన సోను దర్శి (25), రోడ్రిగ్స్ రౌల్ (31)లను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.