శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 నవంబరు 2020 (12:36 IST)

కరోనా వైరస్ సోకి ఒరిస్సా గవర్నరు సతీమణి కన్నుమూత

కరోనా వైరస్ మహమ్మారి అనేక మంది ప్రాణాలను హరిస్తోంది. ఇందులో అనేక మంది వీవీఐపీలు, సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా ఒరిస్సా రాష్ట్ర గవర్నరు గణేశీ లాల్ సతీమణి సుశీలా దేవి ఈ వైరస్ సోకి కోలుకున్న తర్వాత మళ్లీ తిరగబెట్టడంతో చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
 
రాష్ట్ర ప్రథమ పౌరురాలైన సుశీలాదేవి అందరినీ చక్కగా పలకరించేవారని, ఎంతో మర్యాదగా మెలిగేవారని నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. గవర్నర్ గణేశీ లాల్‌, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన నవీన్ పట్నాయక్ ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. 
 
కరోనా వైరస్‌తో కొంతకాలంగా బాధపడుతూ వచ్చిన సుశీలా దేవి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకున్నారు. అయితే, ఈమెకు మళ్లీ ఈ వైరస్ పని చేయడం మొదలుపెట్టడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా ప్రస్తుతం గవర్నర్‌తోపాటు మరో నలుగురు కుటుంబ సభ్యులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
 
ఇంకోవైపు, దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో ఏకంగా 44,059 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 91 లక్షలు దాటింది. మొత్తమ్మీద దేశంలో 91,39,865 కరోనా కేసులు నమోదైనట్లు సమాచారం. 
 
అలాగే కొత్తగా 511మంది ఈ మహమ్మారికి బలయ్యారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 1,33,738కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,43,486 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే మొత్తమ్మీద 85,62,641 మంది కరోనా పేషెంట్లు రికవర్ అయ్యారని చెప్పారు.