భారత క్రికెట్ జట్టులోకి వైభవ్ సూర్యవంశీకి చోటు?
యువ క్రికటెర్ వైభవ్ సూర్యవంశీకి భారత సీనియర్ క్రికెట్ జట్టులో చోటు దక్కనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేవలం 15 యేళ్ల వయసుకే తన అద్భుతమైన బ్యాటింగ్లో అందరి దృష్టిని ఆకర్షించి వైభవ్...ఇపుడు బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దీంతో అతన్ని సీనియర్ జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజనులో ఇప్పటికే రెండు అర్ధ సెంచరీలు బాదిన ఈ యువ సంచలనం, బీసీసీఐ సెలక్టర్లను బాగా ఆకట్టుకున్నాడు. రాబోయే ఐర్లాండ్ పర్యటనలో అతడికి అవకాశం దక్కవచ్చని ప్రచారం జరుగుతుండగా, ఈ పరిణామం సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వంటి సీనియర్ ఆటగాళ్ల ప్లేస్కు ఎర్త్ పెట్టేలా కనిపిస్తోంది.
పీటీఐ కథనం ప్రకారం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే జట్టు కోసం వీసా ప్రక్రియ నిమిత్తం సెలక్టర్లు 35 మందితో కూడిన ప్రాథమిక జాబితాను సిద్ధం చేశారు. ఈ జాబితాలో వైభవ్ సూర్యవంశీ పేరు కూడా ఉన్నట్లు ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. 'జట్టు నేరుగా ఐర్లాండ్కు వెళ్లనున్నందున, యూకే వీసా సరిపోదు. అందుకే ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ఐరిష్ వీసా అవసరం. దీనికోసం కనీసం 35 మంది ఆటగాళ్ల పేర్లను ఇవ్వాలని బీసీసీఐ లాజిస్టిక్స్ విభాగం కోరింది" అని ఆ అధికారి తెలిపారు.
అయితే, వైభవు తుది జట్టులోకి తీసుకోవడం సెలక్టర్లకు కత్తి మీద సాములా మారింది. ప్రస్తుతం భారత జట్టులో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ రూపంలో ముగ్గురు అగ్రశ్రేణి ఓపెనర్లు ఉన్నారు. వీరంతా టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అర్ధ సెంచరీలు సాధించిన వారే కావడం గమనార్హం. వీరితో పాటు యశస్వి జైస్వాల్ కూడా రేసులో ఉన్నాడు. ఈ నేపథ్యంలో నాలుగో ఓపెనర్గా వైభవ్ను తీసుకుంటే, వీరిలో ఒకరిని తప్పించాల్సి వస్తుంది.
ఈ ఎంపిక వ్యవహారం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానానికే ఎసరు పెట్టేలా ఉంది. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత సూర్యకుమార్ పేలవ ఫామ్తో సతమతమవుతున్నాడు. అతని సగటు 20 కంటే తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో "వైభవ్ అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాడని సెలక్టర్లు భావిస్తున్నారు. కానీ, అభిషేక్ లేదా సంజూను తప్పించాలంటే బలమైన కారణాలు చెప్పాలి. వారిలో ఒకరిని తొలగిస్తే, ఫామ్లో లేని సూర్యకుమార్ జట్టులో ఎలా కొనసాగుతున్నాడనే ప్రశ్న తలెత్తుతుంది" అని సదరు బీసీసీఐ అధికారి వివరించారు. దీంతో యువ ప్రతిభకు అవకాశం ఇవ్వాలా? లేక ఫామ్ ఉన్న సీనియర్లకే పెద్దపీట వేయాలా? అనే సంక్లిష్టమైన సవాలు ఇప్పుడు సెలక్షన్ కమిటీ ముందు ఉంది.
