గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 2 ఫిబ్రవరి 2019 (17:50 IST)

ఐదో వన్డేపై కివీస్ గురి... ప్రతీకారానికి సిద్ధమైన టీమిండియా

కివీస్‌తో జరిగిన ఐదు వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మూడు వన్డేల్లో గెలిచిన టీమిండియా నాలుగో వన్డేలో మాత్రం చిత్తుగా ఓడిపోయింది. హామిల్టన్‌ వేదికగా టీమిండియాతో ముగిసిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 93 స్వల్ప లక్ష్యాన్ని కివీస్ 14.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 
 
ఈ నేపథ్యంలో.. ఐదో వన్డేలో భారత్ ఎంతమేరకు రాణిస్తుందనే దానిపై వాడీవేడిగా చర్చ సాగుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్ నెగ్గినప్పటికీ.. ఐదో వన్డేను పరువు కోసమైనా భారత్ గెలుచుకుంటుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ బోల్ట్ లాంటి బౌలర్లతో భారత బ్యాట్స్‌మెన్లకు చుక్కలు కనిపించక తప్పవని వారు చెప్తున్నారు.

టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గాయంతో ఈ మ్యాచ్‌కు తప్పుకోవడంతో పేసర్ ఖలీల్ అహ్మద్ షమీ స్థానంలో బరిలోకి దిగడం వంటివి భారత జట్టును కలవరపరుస్తున్నాయి. 
 
భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించేందుకు సిద్ధమైనా.. నాలుగో వన్డేలో పరాజయం తప్పకపోవడంతో ఐదో వన్డేలో భారత్ గెలుస్తుందా లేదా అనేది అనుమానాస్పదంగా మారింది. ఇక ఐదో వన్డే ఫిబ్రవరి మూడో తేదీన ఆదివారం వెల్లింగ్టన్‌లోని వెస్ట్‌పాక్ స్టేడియంలో జరుగనుంది. వెస్ట్ పాక్ స్టేడియంలో నెగ్గాలంటే ఓపెనర్లు మెరుగ్గా రాణించాల్సి వుంటుంది. 
 
రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ మెరుగ్గా రాణించి పరుగులు సాధిస్తే.. భారత్ విజయపథం వైపు నడుస్తుంది. అలాగే సుబ్మన్ గిల్ కూడా ఈ మ్యాచ్‌లో బ్యాట్‌మెన్‌గా బరిలోకి దిగడం ద్వారా స్కోర్ సాధించే దిశగా దృష్టి పెట్టాలి. అంబటి రాయుడు కూడా తన బలాన్ని పరీక్షించుకోవాల్సిన తరుణమిది.

ఇప్పటికే రెండు మ్యాచ్‌లకు దూరమైన ధోనీ ఫిట్‌నెస్ కారణంగా ఐదో వన్డేలో పాల్గొంటాడా లేదా అనేది తేలాల్సి వుంది. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్‌గా తన సత్తా చాటాల్సి వుంది. ఇక బౌలర్లు కేదర్ జాదవ్, కుల్దీప్, యజ్వేంద్ర చాహల్, జడేజాలు రాణిస్తే తప్పకుండా భారత్‌కు విజయం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.
 
కాగా న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా కివీస్ గడ్డపై పదేళ్ళ తర్వాత వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. మొత్తం ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా, తొలి మూడు వన్డేల్లో భారత జట్టు వరుసగా విజయం సాధించగా, నాలుగో వన్డేలో మాత్రం చిత్తుగా ఓడిపోయింది.

కేవలం 92 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఇక ఐదో వన్డేలో టీమిండియా గెలవాలని వన్డే సిరీస్‌ను విజయంతో ముగించాలనుకుంటుంది.