గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 7 నవంబరు 2015 (16:03 IST)

దక్షిణాఫ్రికాతో తొలిటెస్టు: స్పిన్నర్ల ధాటికి 108 పరుగుల తేడాతో భారత్ గెలుపు!

భారత్-దక్షిణాఫ్రికాల మధ్య మొహాలీలో జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ సేన జయకేతనం ఎగురవేసింది. వన్డే, ట్వంటీ-20 సిరీస్‌లో మెరుగ్గా రాణించలేకపోయిన భారత్.. తొలి టెస్టులో నిలకడగా ఆడుతూ.. సఫారీల బ్యాటింగ్, బౌలింగ్‌కు అడ్డుకట్ట వేయగలిగింది. టీమిండియా బ్యాట్స్‌మెన్లు సైతం బాధ్యతాయుతంగా ఆడటంతో తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది. విజయం టీమిండియాను వరించింది. 
 
భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. తద్వారా తొలి టెస్టులో భారత్ 108 పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
ఇక అమిత్ మిశ్రా, వరుణ్ చెరో వికెట్‌ను పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో 218 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 39.5 ఓవర్లలో 109 పరుగులు మాత్రమే చెయ్యగలిగింది. స్పిన్నర్ల అద్భుత బౌలింగ్‌తో భారత్ తొలి టెస్టు గెలుపుతో శుభారంభం చేసింది. 
 
అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులకే భారత్ కుప్పకూలింది. తదనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా కేవలం 184 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్ల ధాటికి సఫారీలు తోకముడిచారు.

ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ సఫారీ బౌలర్లు విజృంభించడంతో  కేవలం 200 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. తద్వారా 218 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సఫారీ జట్టు 109 పరుగులకే అన్నీ వికెట్లు కోల్పోయి పరాజయం చవిచూసింది.