1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. india vs pakistan women's world cup 2026 : Mandhana, Deepti, Richa star as India breeze past Pakistan

ఐసీసీ టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్

india vs pakistan
ఐసీసీ టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టును భారత్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థిని 64 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దీప్తి శర్మ (5/10) స్పిన్ మాయాజాలంతో లక్ష్యఛేదనలో పాక్ 106 పరుగులకు కుప్పకూలింది. 
 
ఆ జట్టులో ఓపెనర్ మునీబా అలీ 35 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 41 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. గుల్ ఫెరోజా 12, అయేషా జాఫర్ 12, అలియా రియాజ్ 12 పరుగులు చేశారు. భారత బౌలర్లలో శ్రీ చరణి 3, షెఫాలి వర్మ ఒక వికెట్ పడగొట్టారు. 5 వికెట్లు తీసిన దీప్తి శర్మకు ప్లేయర్‌ ఆఫ్‌ ది అవార్డు వచ్చింది. 
 
ఆ తర్వాత 171 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 38 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. మూడో ఓవర్లో 3 ఫోర్లు, నాలుగో ఓవర్లో 2 ఫోర్లు బాది ఊపు మీదున్న మునీబా, గల్‌ ఫెరోజా జోడీని దీప్తి శర్మ విడదీసింది. భార్తీ ఫుల్మాలీ క్యాచ్‌ పట్టడంతో ఫెరోజా పెవిలియన్‌ చేరింది. అనంతరం వచ్చిన అయేషాను సైతం దీప్తి శర్మనే ఔట్‌ చేసింది. ఐదు పరుగుల వ్యవధిలో శ్రీచరణి బౌలింగ్‌లో సైరా జబీన్‌ క్యాచ్‌ ఔట్‌ అయింది. దీంతో 58 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పాక్‌ కష్టాల్లో పడింది. 
 
తొలి పది ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 72/3 స్కోర్‌తో నిలిచింది. మునీబా అలీ, నటాలియా పర్వేజ్‌ జోడీ కుదురుకుంటున్న సమయంలో దాయాది జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. దీప్తి శర్మ అద్భుతమైన డైరెక్ట్‌ త్రోతో అర్ధశతకం దిశగా పయనిస్తున్న ఓపెనర్‌ మునీబా రనౌట్‌ అయింది. 12వ ఓవర్లో ఫాతిమా సనాను షెఫాలీ వర్మ బోల్తా కొట్టించింది. 
 
ఆ తర్వాతి ఓవర్లో శ్రీచరణి బౌలింగ్‌లో నటాలియా పర్వేజ్‌.. హర్మన్‌ప్రీత్‌కు చిక్కింది. దీంతో 79 పరుగులకే ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. కాసేపటికే రమీన్‌ షమీమ్‌ను శ్రీచరణి పెవిలియన్‌ చేర్చింది. చివరలో దీప్తి శర్మ ఓకే ఓవర్‌లో మూడు వికెట్లు తీయడంతో పాక్‌ ఆలౌటైంది. 
 
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళా క్రికెట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. స్మృతి మంథాన 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 68 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 35 బంతుల్లో 36 పరుగులు చేసింది. మ్యాచ్ ఆఖరులో రిచా ఘోష్‌ 17 బంతుల్లో 34 పరుగులు చేయడంతో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి