భారత్ - దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ : ఆసక్తిని రేకెత్తిస్తున్న చివరి వన్డే
భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్ల్లో ఇరు జట్లూ రెండేసి మ్యాచ్లలో విజయం సాధించాయి. దీంతో ఆదివారం చరిత్రాత్మక వాంఖడే మైదానంలో జరిగే చివరి వన్డే మ్యాచ్ అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
వన్డే సిరీస్కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన ట్వంటీ-20 సిరీస్లో భారత జట్టు 2-0తో ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్లో ఇరు జట్లూ నువ్వూనేనా అన్నట్టు సాగుతున్నాయి. తొలి మ్యాచ్లో సఫారీలు గెలుపొందగా, రెండో మ్యాచ్లో భారత్, మూడో మ్యాచ్లో సౌతాఫ్రికా, నాలుగో మ్యాచ్లో ధోనీ గ్యాంగ్ విజయభేరీ మోగించింది. దీంతో సిరీస్ 2-2తో సమమైంది.
ఈ నేపథ్యంలో.. ముంబైలో నిర్ణయాత్మకమైన తుదిపోరుకు సిద్ధమైంది. చరిత్రాత్మక వాంఖడే మైదానంలో ఆదివారం ఐదో వన్డే గెలుపుతో సిరీస్ని కాపాడుకుని సగర్వంగా ఐసీసీ రెండో ర్యాంకును కూడా నిలుపుకోవాలని భారత్ ఆశిస్తోంది. మరోవైపు సఫారీలు కూడా ఒక దెబ్బకు రెండు పిట్టలు చందంగా ఐదో వన్డేలో గెలిచి సిరీస్తోపాటు, ర్యాంకు అవకాశాల్ని పెంచుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఏది ఏమైనా రెండు బలమైన జట్లు నువ్వా-నేనా అంటూ ఈనెల 25న మధ్యాహ్నం తలపడే చివరి వన్డేపై అభిమానుల్లో అమితాసక్తి నెలకొంది.