సంబంధిత వార్తలు
ఐపీఎల్ 2026 ఫైనల్ పోరు : గుజరాత్ ముంగిట 156 రన్స్ టార్గెట్
ఐపీఎల్ 2026 సీజన్ టోర్నీలో భాగంగా, ఆదివారం రాత్రి గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగర్లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ పోరు సాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఈ కీలక పోరు రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆ జట్టులోని వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో అర్థ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. మిగిలిన బ్యాటర్లలో ఓపెనర్లు సాయి సుదర్శన్ 12, గిల్ 10లు విఫలమయ్యారు. వన్డౌన్లో వచ్చిన నిశాంతి సింధు 20 పరుగులు చేసి పెవిలియన్కు చేరుకున్నాడు. జోస్ బట్లర్ 19, అర్షద్ ఖాన్ 15 చొప్పున పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ 3, జోష్ హేజిల్వుడ్ 2, భువనేశ్వర్ కుమార్ 2, కృనాల్ పాండ్యా ఒక వికెట్ చొప్పున తీశారు.
గుజరాత్ ఇన్నింగ్స్లో తొలి రెండు ఓవర్లు సాఫీగానే సాగాయి. ఈ క్రమంలో బంతిని అందుకున్న హేజిల్వుడ్ తన తొలి ఓవర్లోనే శుభ్మన్ను వెనక్కి పంపాడు. తర్వాత భువీ బౌలింగ్లో సాయి సుదర్శన్ భారీ షాట్కు యత్నించి వికెట్కీపర్ జితేశ్కు చిక్కాడు. బట్లర్, నిశాంత్ సింధు ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేయడంతో గుజరాత్ కోలుకున్నట్లే కనిపించింది.
కానీ, ఎనిమిదో ఓవర్లో రసిఖ్ సలామ్ నిశాంత్ను ఔట్ చేయడంతో స్కోరు వేగం నెమ్మదించింది. 9-12 ఓవర్ల మధ్య 18 పరుగులు మాత్రమే వచ్చాయి. దూకుడుగా ఆడలేకపోయిన బట్లర్.. కృనాల్ వేసిన 13 ఓవర్లో స్టంపౌట్గా వెనుదిరిగాడు. అర్షద్ ఖాన్ను హేజిల్వుడ్ వెనక్కి పంపడంతో గుజరాత్ 14.1 ఓవర్లకు 99/5తో మరింత కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన రాహుల్ తెవాతియా (7) కూడా విఫలమయ్యాడు. చివరి మూడు ఓవర్లలో గుజరాత్ 34 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది.
