భారత్ పాకిస్థాన్ మ్యాచ్ జరగపోతే వచ్చే నష్టమేమీ లేదు : సంజయ్ మంజ్రేకర్
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా, భారత్తో ఆడాల్సిన మ్యాచ్ను పాకిస్థాన్ క్రికెట్ జట్టు బహిష్కరించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించారు. ఈ మ్యాచ్ జరగపోతే వచ్చే నష్టమేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా, ఈ నెల 7న తేదీన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభంకానుంది. ఇందులోభాగంగా, భారత్తో మ్యాచ్ను ఆడబోమని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి ఐసీసీకి అధికారపూర్వక సమాచారం అందలేదు.
దీనిపై సంజయ్ మంజ్రేకర్ స్పందించారు. భారత్ - పాక్ మ్యాచ్ జరగకపోయినా ఫర్వాలేదన్నాడు. ప్రస్తుతం పాక్ జట్టు బలహీనంగా ఉందని, భారత క్రికెట్ జట్టుకు పోటీ ఇచ్చే పరిస్థితిలో లేదని పేర్కొన్నాడు. అందుకే భారత్, పాక్ మ్యాచుల్లో మునుపటి మజా లేదన్నాడు. భారత్, పాక్ పోరు కంటే కూడా టీమ్ఇండియా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో తలపడుతుంటేనే ఉత్కంఠభరితంగా ఉంటోందని అభిప్రాయపడ్డాడు.
'భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగకున్నా.. ఫర్వాలేదు. చాలాకాలంగా భారత్, పాక్ మధ్య మ్యాచ్లు రసవత్తరంగా సాగడం లేదు. పూర్తి ఏకపక్షంగా ఫలితాలొస్తున్నాయి. కారణం.. పాక్ జట్టు 90వ దశకంలో ఉన్నట్లుగా బలంగా లేదు. ఇప్పుడు ఆ టీమ్ చాలా బలహీనంగా ఉంది. అసలు భారత్కు పోటీ ఇచ్చే పరిస్థితే లేదు. భారత్ ఆ టీమ్తో తలపడుతుంటే.. ఏదో చిన్న జట్టుతో మ్యాచ్ ఆడుతున్న ఫీల్ ఉంటోంది' అని విశ్లేషించాడు.