గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (17:46 IST)

ధోనీని అతిగా పొగుడుతావా..? బీసీసీఐని విమర్శిస్తావా? పీసీబీ సీరియస్

పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ చిక్కుల్లో పడ్డాడు. కారణం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని అతిగా పొగడటమే. ఆగస్టు 15వ తేదీన ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీకి కనీసం వీడ్కోలు మ్యాచ్‌ని కూడా ఏర్పాటు చేయనుందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై ముస్తాక్ విమర్శలు గుప్పించాడు. 
 
అంతేకాకుండా.. ధోనీ లాంటి దిగ్గజ క్రికెటర్‌ని ట్రీట్ చేసే విధానం ఇది కాదని విమర్శిస్తూనే.. అతను సెండాఫ్ మ్యాచ్ ఆడాలని తనతో పాటు లక్షలాది మంది అభిమానులు కోరుకుంటున్నట్లు తన యూట్యూబ్ ఛానల్‌లో వెల్లడించాడు. దాంతో.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అతడిని మందలించింది. భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా.. పీసీబీ గతంలోనే తమ ఆటగాళ్లు, కోచ్, సహాయ సిబ్బందికి కొన్ని ఆదేశాలు జారీ చేసింది.
 
అందులో భారత క్రికెటర్లు, బీసీసీఐపై ఎలాంటి విమర్శలు, కామెంట్లు చేయకూడదనేది మొదటిది. కానీ.. పాకిస్థాన్ క్రికెటర్ల డెవలప్‌మెంట్ హెడ్‌గా.. పీసీబీ హై ఫర్మామెన్స్ సెంటర్‌లో పనిచేస్తున్న సక్లయిన్ ముస్తాక్ ఆ ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ.. ధోనీ, బీసీసీఐపై మాట్లాడాడు. దాంతో.. పీసీబీ అతడ్ని మందలించింది. ధోనీని అతిగా పొగిడి, బీసీసీఐని విమర్శించిన సక్లయిన్ ముస్తాక్ తీరు పీసీబీకి నచ్చలేదు. అందుకే మందలించిందని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు. పాకిస్థాన్ జట్టుతో కలిసి పనిచేస్తున్న కోచ్‌లు యూట్యూబ్ ఛానల్‌ని నడిపేందుకు వీల్లేదని పీసీబీ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.