సంబంధిత వార్తలు
- ఐపీఎల్ 2026 : గుజరాత్ చేతిలో ఓడిన రాజస్థాన్.. బోరున విలిపించిన వైభవ్
- ఐపీఎల్ 2026 సీజన్లో సరికొత్త రికార్డులు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
- వినేశ్ ఫోగట్ దేశానికి గర్వకారణం : సుప్రీంకోర్టు
- ఐపీఎల్ మ్యాచ్లకు కఠిన నిబంధనలు.. స్మార్ట్ సన్ గ్లాసెస్ ధరించడంపై నిషేధం
- ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్కు వర్షం ముప్పు
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఫైనల్ మ్యాచ్ ఆదివారం రాత్రి అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు కెప్టెన్ రజత్ పటీదార్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటింగ్కు దిగింది. గత రెండు నెలులుగా హోరాహోరీగా సాగిన ఈ టోర్నీ ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగియనుంది.
టాస్ గెలిచిన అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ మాట్లాడుతూ, "మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇది మంచి వికెట్, మ్యాచ్ సాగేకొద్దీ పెద్దగా మార్పులు ఉండవని భావిస్తున్నాం. గతేడాది ఇక్కడ మాకు మంచి జ్ఞాపకాలున్నాయి. ఈ మ్యాచ్ గెలవడానికి మా వంతు అత్యుత్తమ ప్రదర్శన చేస్తాం. ప్రస్తుతంపై దృష్టి పెట్టడం ముఖ్యం. మేము ఎలాంటి మార్పులు లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగుతున్నాం" అని తెలిపాడు.
గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ మాట్లాడుతూ, "మేము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనే అనుకున్నాం. ఇది మాకు అలవాటైన వికెట్. తొలి మూడు ఓవర్లలో ఫాస్ట్ బౌలర్లకు స్వింగ్ లభించే అవకాశం ఉంది. సాయి కిషోర్ స్థానంలో అర్షద్ ఖాన్ను జట్టులోకి తీసుకున్నాం" అని చెప్పాడు.
ఇక పిచ్ విషయానికొస్తే, ఇది బ్యాటింగ్కు స్వర్గధామంగా ఉంటుందని క్యూరేటర్లు విశ్లేషించారు. ఎరుపు, నలుపు మట్టి మిశ్రమంతో తయారు చేసిన ఈ పిచ్పై బంతి చక్కగా బ్యాట్పైకి వస్తుంది. బౌండరీలు 66 మీటర్ల దూరంలో సమంగా ఉండటంతో ఇరు జట్ల బ్యాటర్లకు పరుగుల పండుగ ఖాయమనిపిస్తోంది. అయితే, మ్యాచ్ గడిచేకొద్దీ పిచ్ కొద్దిగా నెమ్మదించే అవకాశం ఉందని, ఛేజింగ్ చేసే జట్టుకు అనుకూలించే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.
కాగా, ఈ సీజనులో ఈ రెండు జట్లు తలపడటం ఇది నాలుగోసారి. లీగ్ దశలో చెరొక మ్యాచ్ గెలవగా, క్వాలిఫైయర్-1లో ఆర్సీబీ భారీ విజయం సాధించి నేరుగా ఫైనల్కు చేరింది. ఆ మ్యాచ్ ఆర్సీబీ 254 పరుగుల భారీ స్కోరు చేయగా, గుజరాత్ 92 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇప్పుడు ఫైనల్లో మరోసారి అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఈ సీజన్ ఆరంభం నుంచి నిలకడైన ప్రదర్శనతో లీగ్ దశలో టాప్-2లో నిలిచిన ఈ రెండు జట్లే తుది పోరుకు అర్హత సాధించాయి. మిగతా జట్లైన లక్నో, ముంబై, చెన్నై, కోల్కతా వంటివి తీవ్రంగా నిరాశపరిచాయి. దాదాపు 65 సార్లు 200 పైచిలుకు స్కోర్లు నమోదైన ఈ "బ్యాటింగ్ ఫెస్టివల్" సీజనులో అసలైన విజేత ఎవరో తేలడానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. హోరాహోరీగా సాగనున్న ఈ మ్యాచ్లో ఏ జట్టు ఒత్తిడిని జయించి రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్గా నిలుస్తుందో వేచి చూడాలి.
