ధోనీ ఏదో ఒక ఫార్మాట్ గుడ్ బై చెప్తాడని తెలుసు: బీసీసీఐ
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టెస్టుల్లో విఫలమవుతున్నాడని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో సహించలేని కూల్ కెప్టెన్ ధోనీ టెస్టులకు ఏకంగా గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ ఏదో ఒక ఫార్మాట్కు గుడ్ బై చెబుతాడన్న విషయం తనకు ముందే తెలుసునని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ చెప్పాడు.
మ్యాచ్ అవగానే ధోనీ తనకు ఫోన్ చేశాడని, టెస్టుల నుండి రిటైరవ్వాలనుకున్నట్లు చెప్పాడని, గాయమేమైనా అయిందా అని అడిగానని, అదేం లేదని ధోనీ చెప్పాడని తెలిపాడు. మంచి కారణాలతోనే తాను తప్పుకుంటున్నానని చెప్పాడన్నాడు.
ఇదే చివరి నిర్ణయమా అని తాను ధోనీని అడిగితే, అవునని చెప్పాడన్నాడు. అయితే వెంటనే ప్రకటన చేయవద్దని, సహచరులకు ఇంకా చెప్పలేదని అన్నాడని సంజయ్ పటేల్ చెప్పుకొచ్చాడు.
అనంతరం తాను చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్, బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్కు చెప్పానని, అందరు ధోని నిర్ణయాన్ని గౌరవించాలని చెప్పారన్నారు. రిటైర్మెంట్ గురించి ఈ టెస్టుకు ముందే ధోనీ తనతో చర్చించాడని, ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదన్నాడు.