హనీమూన్ మర్డర్ కేసు తరహాలో పెళ్లైన మూడు నెలలకే భర్తను చంపేసిన కిలేడి
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు తరహాలోనే ఓ హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. పెళ్లైన మూడు నెలలకే భర్తని పక్కా ప్లాన్తో లేపేసింది ఓ కిలేడి. రాజస్థాన్ శ్రీగంగానగర్లో జనవరి 30 ఆశిష్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీని వెనుక అతని భార్య, ఆమె ప్రియుడి హస్తం ఉన్నట్లు తేలింది.
జనవరి 30వ తేదీ రాత్రి 9 గంటలకి కొత్తగా పెళ్లయిన ఆశిష్, అంజూ దంపతులు రోడ్డుపై స్పృహ లేకుండా పడి ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆశిష్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
తన భర్త గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయాడని, ఆ సమయంలో దొంగలు తన నగలు, మొబైల్ దోచుకెళ్లారని అంజూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈవినింగ్ వాక్ వెళ్లగా ఈ ప్రమాదం జరిగిందని ఆమె కన్నీరుమున్నీరై నమ్మించే ప్రయత్నం చేసింది.
ఎస్పి అమృతా దుహన్ దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అంజూ ప్రవర్తనపై మొదట్లోనే అనుమానం కలిగింది. ఆపై విచారణలో భర్తను భార్యే హతమార్చినట్లు తేలింది. ఆమె మొబైల్ ఫోన్ను స్కాన్ చేయగా, తన ఇంటి సమీపంలోనే ఉండే సంజూ అనే వ్యక్తితో ఆమె నిరంతరం టచ్లో ఉన్నట్లు వెల్లడైంది.
పెళ్లయిన మూడు నెలలకే ప్రియుడి మోజులో పడిన అంజూ భర్తను అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ వేసింది. మర్డర్ని యాక్సిడెంట్గా నమ్మించేందుకు కొన్ని రోజుల ముందు నుంచే భర్తతో కలిసి డిన్నర్ తర్వాత వాకింగ్కు వెళ్లడం అలవాటు చేసుకుంది. చివరికి పక్కా ప్లాన్ చేసి చంపేసింది. ఈ కేసులో అంజూతో పాటు మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.