భార్య ప్రవర్తనపై అనుమానం.. తుపాకీతో కాల్చి చంపేసిన భర్త
భార్య ప్రవర్తనను అనుమానించిన భర్త... ఆమెను తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరధిలోని మారుతీ నగర్లో నివాసం ఉంటున్న అరుణ్ కుమార్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. గత కొంతకాలంగా దపంతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మాట్లాడుకుందామని చెప్పి మరో వ్యక్తితో కలిసి తెల్లవారుజామున ఇంటికి వచ్చిన అరుణ్.. భార్య నిషారాణిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అయితే, ఈ తుపాకీ కాల్పుల శబ్దం ఉన్న ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొదటి భార్యకు విడాకులిచ్చిన అరుణ్ కుమార్.. ఆమె సోదరిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. మూడు నెలల క్రితం అంబర్పేటలో వాహన తనిఖీలు చేస్తుండగా.. అరుణ్కుమార్ తుపాకీతో పోలీసులకు చిక్కాడు. తుపాకీ సీజ్ చేయడంతో పాతబస్తీకి చెందిన స్నేహితుల ద్వారా మరో తుపాకీ కొనుగోలు చేసి దారుణానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.
