ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడనీ ప్రియుడుని కత్తితో పొడిచి చంపేసిన ప్రేయసి
మనస్పర్థల నేపథ్యంలో తన నంబరును బ్లాక్ చేసిన ప్రియుడిని ప్రియురాలు కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ దారుణం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ప్రసాద్ సూర్యవంశీ (25) అనే యువకుడు స్థానిక టీచర్స్ కాలనీలో నివసిస్తూ ఒక హోటల్లో పని చేస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఒక యువతితో అతనికి ప్రేమ వ్యవహారం ఉంది. అయితే, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రసాద్ తన ప్రియురాలి ఫోన్ నంబరును బ్లాక్ చేశాడు.
దీంతో తన ఫోన్ నంబరును ఎందుకు బ్లాక్ చేశావంటూ నిలదీసేందుకు ప్రియుడి ఇంటికి ప్రియురాలు వెళ్లింది. అతడి మొబైల్లోని చాటింగ్ వివరాలు చూపించాలని పట్టుబట్టింది. దీనికి ప్రసాద్ నిరాకరించడంతో ఆగ్రహానికిగురైన ఆమె తన వెంట తెచ్చుకున్న కత్తితో అతడిపై విచక్షణా రహితంగా దాడి చేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రసాద్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
దీనిపై సమాచారం అందుకున్న బిలాస్పూర్ ఎస్పీ రజనీశ్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి వద్ద విచారణ జరుపుతున్నామని, హత్యకు గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.