గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : శనివారం, 19 డిశెంబరు 2015 (15:51 IST)

చంద్రన్న చేతిలో రోజమ్మ భవిష్యత్తు: సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తారా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. కాల్ మనీ వ్యవహారంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా ఎమ్మెల్యే రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడింది. అయితే రోజమ్మపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు స్పీకర్ కోడెలను విజ్ఞప్తి చేశారు. 
 
రోజాపై సస్పెన్షన్‌ వేటును ఈ అసెంబ్లీ సెషన్స్ వరకు పరిమితం చేయాలని విష్ణు కుమార్ రాజు కోరారు. దీనిపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. రోజా సస్పెన్షన్‌పై స్పీకర్ కోడెల ఇక ఎలాంటి నిర్ణయం తీసుకోలేరని.. ఇకపై రోజాపై సస్పెన్షన్‌‌కు సంబంధించి అసెంబ్లీ లేదా ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి  ఉంటుందని వ్యాఖ్యానించారు. 
 
యనమల మాటల్ని బట్టి చూస్తే.. ప్రభుత్వమంటే.. ఇక ఏపీ సీఎం చంద్రబాబుకు రోజాపై సస్పెన్షన్‌ను ఎత్తివేసే అధికారం ఉన్నట్లు తెలుస్తోంది. రోజా సస్పెన్షన్‌పై ఓటింగ్ నిర్వహించి.. ఆ ఓటింగ్‌కు టీడీపీ ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటేస్తే రోజమ్మకు ఊరట లభిస్తుంది.

ఇప్పటికే అసెంబ్లీ టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజా సస్పెన్షన్ నుంచి రెండుసార్లు ఎస్కేప్ అయ్యింది. అయితే ఈసారి మాత్రం సీఎంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా సస్పెన్షన్‌కు గురైంది. తద్వారా రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటే.. అది చంద్రబాబు మనస్సు మారితేనే సాధ్యమవుతుందా?