సంబంధిత వార్తలు
మృగశిర కార్తె రోజే చేప ప్రసాదం ఎందుకు ఇస్తారు?
చేప ప్రసాదాన్ని ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చే మృగశిర కార్తె ప్రారంభమయ్యే రోజునే పంపిణీ చేస్తారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే... వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు. మృగశిర కార్తెతో ఎండలు తగ్గి, వర్షాలు ప్రారంభమవుతాయి. వాతావరణంలో ఒక్కసారిగా తేమ పెరగడం వల్ల ఆస్తమా, శ్వాసకోశ రోగులకు ఇబ్బందులు ఎక్కువవుతాయి. ఆ సమయంలో ఈ ప్రసాదం ఉపశమనం ఇస్తుందని నమ్ముతారు.
ఆయుర్వేద కోణం ప్రకారం వాతావరణం చల్లబడినప్పుడు శరీరంలో కఫం పెరగకుండా ఉండటానికి, ఊపిరితిత్తులకు తగినంత వేడి అవసరమవుతుంది. చేపలకు సహజంగానే శరీరంలో వేడిని పెంచే గుణం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తె రోజున ఖచ్చితంగా ఇళ్లలో చేపల కూర వండుకుని తినే ఒక బలమైన సాంప్రదాయం కూడా ఉంది.
చేప ప్రసాదాన్ని ఎలా ఇస్తారంటే... ఒక చిన్న బతికున్న కొరమీను చేప పిల్ల నోట్లో పసుపు రంగులో ఉండే ప్రత్యేక మూలికా ముద్దను ఉంచుతారు. ఆ చేప పిల్లను రోగి నోట్లోకి వేసి బతికుండగానే మింగిస్తారు. ఆ చిన్న చేప లోపలికి వెళ్లేటప్పుడు చేసే కదలికల వల్ల శ్వాసనాళాల్లోని కఫం క్లియర్ అవుతుందని నమ్ముతారు. చేపలు తినని వారి కోసం ఈ మూలికా ముద్దను బెల్లం లేదా అరటిపండుతో కలిపి ఇస్తారు.
ఈ ప్రసాదం తీసుకున్న వారు వరుసగా 3 సంవత్సరాలు రావలసి ఉంటుంది, అలాగే 45 రోజుల పాటు కొన్ని ప్రత్యేక ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది.
