1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
  4. India Is Saving More Lives Than Ever Before. But Why Are Millions Still Unable to Return to Normal Life?

ప్రాణాలు నిలబడుతున్నా... సాధారణ జీవితం కరువే

India Is Saving More Lives
హైదరాబాద్: భారతీయ వైద్య రంగం ఎమర్జెన్సీ మెడిసిన్, ఐసీయూ సేవలు, గాయాలకు చికిత్స అందించడం, పక్షవాతం నిర్వహణ, అత్యాధునిక శస్త్రచికిత్సల్లో అద్భుతమైన ప్రగతి సాధించింది. ఒకప్పుడు ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి సైతం రోగులు సురక్షితంగా బయటపడుతున్నారు. అయితే, ప్రాణాలు నిలబడుతున్నా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక చాలామంది సాధారణ జీవితానికి తిరిగి రాలేకపోతున్నారు. నడక కోల్పోవడం, మాట పడిపోవడం, ఆలోచనా శక్తి తగ్గడం, మానసిక క్షోభ, ఇతరులపై ఆధారపడటం వంటి సమస్యలతో జీవితాంతం కుంగుబాటుకు గురవుతున్నారు. మన వైద్య వ్యవస్థ కేవలం ప్రాణాపాయం నుంచి రక్షించడంపైనే దృష్టి సారించిందని, రోగి పూర్తిగా కోలుకునేలా చేయడంలో వెనుకబడిందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
ఈ లోటును పూడ్చే దిశగా, హెచ్‌సీఏహెచ్ రిహాబ్ అండ్ రికవరీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బేగంపేట్‌లోని ఐటీసీ కాకతీయలో రికవరీ వన్ కాన్ఫరెన్స్ 2026 పేరిట ఒక ప్రత్యేక సదస్సు జరిగింది. రోగుల కోలుకునే విధానం, పునరావాసం, మరియు నివారించదగిన వైకల్యాన్ని తగ్గించడం అనే అంశాలపై దేశంలో జరిగిన తొలి ప్రత్యేక సదస్సు ఇదే. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్యులు, పునరావాస నిపుణులు, ఆసుపత్రుల అధిపతులు, విధాన నిర్ణేతలు, బీమా సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. చికిత్స పూర్తయిన తర్వాత కాకుండా, కోలుకునే ప్రక్రియను వైద్యంలో ఒక అంతర్భాగంగా ఎలా మార్చాలనే దానిపై వీరు లోతుగా చర్చించారు.
 
వేగవంతమైన రికవరీ-నివారించదగిన వైకల్యం తగ్గింపు" అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. మన దేశంలో పునరావాస చికిత్స చాలా ఆలస్యంగా మొదలవుతోందని, దాన్ని కేవలం ఫిజియోథెరపీగా మాత్రమే చూస్తున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. న్యూరాలజిస్టులు, సైకాలజిస్టులు, స్పీచ్ థెరపిస్టులు, నర్సులు, పోషకాహార నిపుణులు తదితరులందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే సంపూర్ణ ఆరోగ్య పునరుద్ధరణ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. పక్షవాతం, ప్రమాదాలు, మెదడుకు గాయాలు అయినప్పుడు తొలి దశలోనే అందించే పునరావాస చికిత్స అత్యంత కీలకమని, కానీ చాలా మందికి ఇది అందడం లేదని పేర్కొన్నారు.
 
భారతదేశంలో ఏటా 12.5 లక్షల కొత్త పక్షవాతం కేసులు నమోదవుతున్నాయని, ఇది ప్రపంచ సగటులో 10 శాతమని వివరించారు. హెచ్‌సీఏహెచ్ ప్రెసిడెంట్, కో-ఫౌండర్ డాక్టర్ గౌరవ్ తుక్రాల్ మాట్లాడుతూ.. గతంలో కంటే ఇప్పుడు మనం ఎక్కువ ప్రాణాలను కాపాడుతున్నాం. కానీ, ఒక రోగి తిరిగి నడవగలగడం, మాట్లాడగలగడం, పనులకు వెళ్లగలగడంలోనే వైద్యం యొక్క నిజమైన విజయం దాగి ఉంది. ఆసుపత్రులు, పునరావాస కేంద్రాలు, ఇంటి వద్ద సంరక్షణ మధ్య ఉన్న అంతరాన్ని చెరిపేసేందుకే ఈ రికవరీ వన్ వేదికను ఏర్పాటు చేశాం అని అన్నారు.
 
సంస్థ మరో ప్రెసిడెంట్, కో-ఫౌండర్ శ్రీ అంకిత్ గోయెల్ మాట్లాడుతూ.. వచ్చే దశాబ్దంలో 'రికవరీ' అనేది వైద్యరంగంలో అత్యంత కీలక ప్రాధాన్యతగా మారనుంది. కృత్రిమ మేధ, రోబోటిక్స్-ఆధారిత థెరపీ, టెలీ-రిహాబిలిటేషన్, ధరించగలిగే మానిటరింగ్ పరికరాల ద్వారా కోలుకునే ప్రక్రియను మరింత వేగవంతం చేయవచ్చు అని వివరించారు.
 
హెచ్‌సీఏహెచ్ మెడికల్ ఆపరేషన్స్ అండ్ క్వాలిటీ డైరెక్టర్ డాక్టర్ విజయ్ జనగామ మాట్లాడుతూ.. వైకల్యాన్ని భారీ స్థాయిలో తగ్గించాలంటే, పునరావాసం అనేది రోగికి చికిత్స మొదలుపెట్టిన తొలి దశ నుంచే ప్రారంభం కావాలి అని స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక సదస్సు మాత్రమే కాదని, భారతీయ వైద్య విధానంలో రికవరీని ప్రధాన అంశంగా మార్చే ఒక జాతీయ ఉద్యమానికి ఇది నాంది అని నిర్వాహకులు పేర్కొన్నారు.
About Writer
జయ
Content provider.... మరింత చదవండి
తర్వాతి కథనం
మధుమేహాన్ని అదుపులో వుంచే ఆయుర్వేద చిట్కా