శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 17 జులై 2014 (12:11 IST)

పవిత్ర యుద్ధం: అల్ ఖైదా ఆఖరి పోరాటం భారత్‌పైనే!!

అల్ ఖైదా భారత్‌పై కన్నేసింది. పవిత్ర యుద్ధం పేరిట భారత్ సహా, ఇతర ఇస్లామేతర దేశాలపై దాడులకు తెగబడుతున్న అల్ ఖైదా, తాజాగా భారత్‌పై ఆఖరి పోరాటానికి సిద్ధమైనట్లు స్పష్టమైన సంకేతాలు వెల్లడి అవుతున్నాయి. నిఘా వర్గాలకు అందిన సమాచారం మేరకు భారత్‌పై జరపనున్న దాడుల్లో ఈ ఉగ్రవాద సంస్థ తాలిబన్, ఇండియన్ ముజాహిదీన్, హిజ్బుత్ తెహ్రిర్ తదితర ఉగ్రవాద సంస్థల సహకారం తీసుకుని విధ్వంసం సృష్టించేందుకు పన్నాగం పన్నుతోందని తెలుస్తోంది.
 
ఇప్పటికే కాశ్మీర్ తరహా ప్రాంతాల్లోని యువతను తమవైపు తిప్పుకునే విషయంతో అల్‌ఖైదా కొంతమేర విజయం సాధించినట్లే కనిపిస్తోంది. గతేడాది ‘వెల్ కమ్ తాలిబాన్’ అంటూ కాశ్మీర్‌లోని హరి పర్బత్ కోటపై రాతలూ దర్శనమిచ్చాయి. అంతేకాక శ్రీనగర్‌లో ఏకంగా తాలిబాన్ జెండానే రెపరెపలాడిన వైనం ఆందోళనకు గురిచేస్తోంది. 
 
ఇటీవల పోలీసులకు పట్టుబడ్డ ఐఎం ఉగ్రవాది యాసిన్ భత్కల్ విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. అల్‌ఖైదా ఆధ్వర్యంలో ఆన్ లైన్‌లో నడుస్తున్న ’అజాన్‘ సామాన్యులెవరికీ కనిపించదు. ఎప్పటికప్పుడు పాస్ వర్డ్‌లను మార్చుకుంటూ సంస్థలోని వ్యక్తులు, అనుబంధ సంస్థలకు కీలక సమాచారాన్ని చేరవేయడంలో కీలక భూమిక పోషిస్తోంది. 
 
ఈ పత్రిక బోధనలతో పలువురు యువకులు ఉగ్రవాదం వైపు మళ్లుతున్నారు. ఈ పరంపర మరింత వేగంగా విస్తరిస్తున్నట్లు నిఘా వర్గాల వద్ద సమాచారం ఉంది. ఈ విషయం వాస్తవమేనన్నట్లు ఇప్పటికే కాశ్మీర్‌లో తమ కార్యాలయాలు తెరిచామని తాలిబన్లు ప్రకటించారు. ‘గజ్వా-ఏ-హింద్’ పేరుతో అల్ ఖైదా తీవ్రవాదులు వ్యవహరిస్తున్న 'భారత్ పై ఆఖరి పోరు'ను పునాదిలోనే అణచివేసేందుకు భారత దర్యాప్తు సంస్థలు ఇప్పటికే రంగంలోకి దిగాయి.