1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Ebola Outbreak Alert: India Issues Travel Advisory as Cases Rise in Congo and Uganda

ఎబోలా వైరస్ విజృంభణ : ఆ నాలుగు దేశాలకు వెళ్లవద్దంటున్న భారత్

ebola virus
ఆఫ్రికా ఖండంలో ఎబోలా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే అనేక మంది ఈ వైరస్ బారినపడటంతో పాటు పలువురు మృత్యువాతకూడా పడ్డారు. దీంతో కేంద్రం అప్రమత్తమై, దేశ పౌరులకు ఓ హెచ్చరిక చేసింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ప్రస్తుతం నివసిస్తున్న లేదా ఆ దేశాలకు ప్రయాణాలు పెట్టుకున్న భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ దేశాలకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
 
ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలలో 'బుండిబుగ్యో' రకం ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు నిర్ధారణ అయింది. దీని తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్), ఈ పరిస్థితిని 'అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి'గా ప్రకటించింది. మే 22న సమావేశమైన డబ్ల్యూహెచ్ అత్యవసర కమిటీ, వ్యాధి సోకిన ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను ఎంట్రీ పాయింట్ల వద్ద నిశితంగా పరిశీలించాలని, వివరించలేని జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించి, నివేదించాలని సిఫార్సు చేసింది. అదేవిధంగా ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (ఆఫ్రికా సీడీసీ) కూడా దీనిని ఖండాంతర భద్రతకు సంబంధించిన ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.
 
ఎబోలా అనేది బుండిబుగ్యో వైరస్ జాతి వల్ల కలిగే ఒక రకమైన వైరల్ హెమరేజిక్ ఫీవర్. ఇది అధిక మరణాల రేటుతో కూడిన తీవ్రమైన వ్యాధి. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ నిర్దిష్ట వైరస్ జాతిని నివారించడానికి లేదా చికిత్స చేయడానికి ఇప్పటివరకు ఎలాంటి వ్యాక్సిన్లు గానీ, నిర్దిష్ట మందులు గానీ ఆమోదం పొందలేదు. కాంగో, ఉగాండా దేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న దక్షిణ సూడాన్ వంటి దేశాలకు ఈ వ్యాధి వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఈ మూడు దేశాలకు ప్రయాణాలపై ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ఇప్పటికే అక్కడ ఉన్నవారు స్థానిక ఆరోగ్య అధికారుల మార్గదర్శకాలను కఠినంగా పాటించాలని, వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అయితే, భారత్లో ఇప్పటివరకు ఈ రకం ఎబోలా వైరస్ కేసు ఏదీ నమోదు కాలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయినప్పటికీ అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
బెంగుళూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలపై సీఎం విజయ్ దృష్టి!