1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Iran Fires on Ships in Hormuz, Indian Tankers Retreat as Oil Supply Fears Surge

హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పులు - ఢిల్లీలో ఇరాన్ రాయబారికి సమన్లు

oil ship
హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న భారత నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు జరిపింది. దీంతో ఈ నౌకలు తిరిగి వెనక్కి వెళ్లిపోయాయి. ఈ కాల్పుల విషయాన్ని నిర్ధారించుకున్న కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని ఇరాన్ రాయబారికి సమన్లు జారీచేసింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) బలగాలు ఒక ఆయిల్ ట్యాంకర్‌పై కాల్పులు జరపగా, రెండు భారత జెండా కలిగిన నౌకలు సహా పలు వాణిజ్య నౌకలు వెనక్కి మళ్లాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళనలను రేకెత్తిస్తోంది.
 
ఈ ఘటన ఒమన్‌కు 20 నాటికల్ మైళ్ల దూరంలో శనివారం చోటుచేసుకున్నట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీవో) ధృవీకరించింది. తమ కథనం ప్రకారం, ఇరాన్‌కు చెందిన రెండు గనోట్లు ఎలాంటి రేడియో హెచ్చరికలు జారీ చేయకుండా ఒక ట్యాంకర్‌ను సమీపించి కాల్పులకు తెగబడ్డాయి. అయితే, ఈ ఘటనలో నౌకకు గానీ, సిబ్బందికి గానీ ఎలాంటి హాని జరగలేదని, అంతా సురక్షితంగా ఉన్నారని ట్యాంకర్ మాస్టర్ నివేదించినట్లు యూకేఎంటీవో తెలిపింది.
 
ఇదేసమయంలో, హర్మూజ్ జలసంధిపై తిరిగి తమ పూర్తిస్థాయి నియంత్రణను పునరుద్ధరించినట్లు ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికా తమ నౌకలపై కొనసాగిస్తున్న దిగ్బంధనానికి ప్రతిస్పందనగా ఈ మూసివేత చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. అమెరికా ఆంక్షలు ఎత్తివేసేంత వరకు ఈ నియంత్రణ కొనసాగుతుందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తస్నిమ్ పేర్కొంది.
 
ఇరాన్ కాల్పుల నేపథ్యంలో వెనక్కి మళ్లిన నౌకల్లో రెండు భారతీయ జెండా నౌకలు ఉన్నట్లు సమాచారం. వీటిలో ఒకటి 20 లక్షల బ్యారెల్స్ ఇరాక్ చమురును తరలిస్తున్న భారీ సూపర్ ట్యాంకర్ కావడం గమనార్హం. ఇరాన్ తాజా చర్యలతో హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న సుమారు 10 వాణిజ్య నౌకలు తమ మార్గాలను మార్చుకుని వెనక్కి మళ్లినట్లు జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
భాగ్యనగరి వాసులకు శుభవార్త - జూన్ 2 నుంచి ఉచిత ప్రయాణం