ఇరాన్తో అణు చర్చలు విఫలం... ఏ క్షణమైనా అమెరికా బాంబుల వర్షం
ఇరాన్తో అమెరికా జరిగిన అణు చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఇరాన్పై ఏ క్షణమైన బాంబుల వర్షం కురిపించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఫలితంగా మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ వారాంతంలోనే ఇరానైపై దాడులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల కోసం సైన్యం ఎదురుచూస్తోందని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇప్పటికే అమెరికా తన వైమానిక, నౌకా దళాలను పెద్ద ఎత్తున మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక యుద్ధ విమాన వాహక నౌక 'యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్' ఈ వారాంతంలోగా ఆ ప్రాంతానికి చేరుకోనుంది. దీనికితోడు యూకే నుంచి యుద్ధ విమానాలు, రీప్యూయలింగ్ ట్యాంకర్లు కూడా ఇరాను సమీపంలో మోహరించాయి. ఒకవేళ దాడులు జరిగితే, ఇజ్రాయెల్తో కలిసి కొన్ని వారాల పాటు ఈ ఆపరేషన్ కొనసాగవచ్చని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇరాన్ అణు కార్యక్రమాలపై మంగళవారం జెనీవాలో జరిగిన పరోక్ష చర్చలు సఫలం కాలేదు. అణు కేంద్రాలను పూర్తిగా మూసివేయాలని అమెరికా డిమాండ్ చేయగా, ఇరాన్ దానికి అంగీకరించలేదు. "దౌత్యానికే మా మొదటి ప్రాధాన్యం, కానీ అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోం" అని వైట్ హౌస్ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పష్టం చేశారు.
మరోవైపు అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. తమ అణు కేంద్రాలను కాపాడుకునేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. తాజా ఉపగ్రహ చిత్రాల ప్రకారం, పర్చిన్, ఇస్ఫాహాన్ వంటి కీలక కేంద్రాల చుట్టూ కాంక్రీట్ గోడలు నిర్మిస్తోంది. వైమానిక దాడుల నుంచి రక్షణ కోసం భూగర్భ సొరంగాలను కూడా సిద్ధం చేసుకుంటోంది.